Ravindra Jadeja: రికార్డు సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా.. తొలి భార‌తీయ క్రికెట‌ర్‌గా అరుదైన ఘ‌న‌త‌!

Ravindra Jadeja Creates History Becomes First Indian To

  • 12 సార్లు ఒక టెస్టులో అర్ధ శ‌త‌కంతో పాటు ఐదు వికెట్లు తీసిన‌ జ‌డ్డూ
  • భార‌త క్రికెట‌ర్ల‌లో ఈ జాబితాలో జ‌డేజాదే అగ్ర‌స్థానం
  • అత‌ని త‌ర్వాతి స్థానంలో అశ్విన్ (11), క‌పిల్ దేవ్ (07), హ‌ర్భ‌జ‌న్ (03)

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా టెస్టుల్లో అరుదైన రికార్డు నెల‌కొల్పాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో 86 ప‌రుగుల‌తో పాటు 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇలా ఒక టెస్టులో అర్ధ శ‌త‌కంతో పాటు ఐదు వికెట్లు తీయ‌డం జ‌డ్డూకు ఇది ప‌న్నెండోసారి. భార‌త క్రికెట‌ర్ల‌లో ఈ జాబితాలో జ‌డేజానే అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌ని త‌ర్వాత ర‌విచంద్ర‌న్ అశ్విన్ (11), క‌పిల్ దేవ్ (07), హ‌ర్భ‌జ‌న్ సింగ్ (03) ఉన్నారు.  

ఇక ఈ ఫీట్ సాధించిన ప్ర‌పంచ క్రికెట‌ర్ల జాబితాలో జ‌డేజా రెండవ స్థానంలో ఉన్నాడు. అత‌ని కంటే ముందు కేవలం ఇయాన్ బోథమ్ (16) మాత్రమే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎక్కువ సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. అలాగే బంగ్లాదేశ్ సీనియ‌ర్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (11) అశ్విన్‌తో సమంగా ఉన్నాడు. 

ఇదిలాఉంటే.. చెన్నై టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండ‌ర్ షోతో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. మొద‌టి ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి, బంగ్లాను కుప్ప‌కూల్చాడు. దీంతో ఆతిథ్య భార‌త జట్టు 280 పరుగుల తేడాతో బంప‌ర్ విక్ట‌రీ నమోదు చేసింది. 

అటు మ‌రో ఆల్‌రౌండ‌ర్‌ రవీంద్ర జడేజా కూడా ఈ మ్యాచ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌తో కలిసి జ‌డ్డూ ఏకంగా 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విష‌యం తెలిసిందే. 86 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన జ‌డేజా.. జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేయ‌డానికి దోహ‌ద‌పడింది. ఆ త‌ర్వాత‌ మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మ‌రో మూడు కీల‌క‌ వికెట్లు తీశాడు.

చెన్నైలో బంగ్లాను చిత్తు చేసిన రోహిత్ సేన ఇప్పుడు రెండో టెస్టును కాన్పూర్ వేదిక‌గా ఆడ‌నుంది. ఈ నెల 27 నుంచి ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

  • Loading...

More Telugu News