CM Chandrababu: 100 రోజుల పాలన.. 1000 అడుగులు ముందుకు: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Review Meeting on Completion of 100 Days AP Govt

  • ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలు ఇంటింటా వివరించాల‌న్న సీఎం
  • ఈ నెల 20 నుండి 26 వరకు కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండాల‌ని సూచ‌న‌
  • దీపావళి పండుగ కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామ‌ని హామీ
  • వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్నీ భయంకర పరిస్థితులేన‌న్న ముఖ్య‌మంత్రి
  • కూటమి ప్రభుత్వంలో అన్నింటినీ చక్కదిద్దుతూ అడుగులు ముందుకు వేస్తున్నామ‌ని వెల్ల‌డి
  • మూడు పార్టీల ఆలోచనలు భిన్నంగా ఉన్నా.. ధ్యేయం రాష్ట్రాభివృద్ధేన‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావొస్తోంది. ఈ వంద రోజుల్లో పాలనాపరంగా 1000 అడుగులు ముందుకు వేశామ‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈనెల 20వ తేదీ నుండి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని ముఖ్య‌మంత్రి సూచించారు. 

ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే పాలన ఎలా ఉంటుందో ఈ 100 రోజులు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులంతా నెలకు పది రోజుల పాటు ప్రజల్లో ఉండాల‌ని టీడీపీ అధినేత ఆదేశించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కూటమి ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసగించారు. 

వైసీపీ హయాంలో రాష్ట్రంలో భయంకర పరిస్థితులు

వైసీపీ పాలనలో రాష్ట్రంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. త‌న‌ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టార‌ని గుర్తు చేశారు. పరామర్శకు పవన్ కల్యాణ్ రాకుండా బుక్ చేసుకున్న విమానాన్ని రద్దు చేశారని తెలిపారు. రోడ్డు మార్గాన వస్తుంటే నందిగామలో అడ్డుకోవడంతో ప‌వ‌న్‌ రోడ్డుపై పడుకుని ధర్నా చేశార‌ని గుర్తు చేశారు. సాధారణంగా షూటింగ్‌లో చేయాల్సినవి.. నిజ జీవితంలో కూడా చేసి పోరాట యోధునిగా పవన్ నిలిచార‌ని కొనియాడారు. రాజకీయాల్లోకి పవన్ ఒక ఆశయంతో వచ్చార‌ని తెలిపారు. 

2014లో టీడీపీ, బీజేపీ పొత్తుపెట్టుకున్న సమయంలో జ‌న‌సేనాని ఓట్లు చీలకుండా ఉండేందుకు పోటీ చేయకుండా అభ్యర్థుల తరపున ప్రచారం చేశార‌ని బాబు గుర్తు చేశారు. రాజమండ్రి జైల్లో త‌న‌ను కలిసి వచ్చిన అనంతరం రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించార‌ని గుర్తు చేశారు. అప్పుడే ప్రజలు గెలవాలి.. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. 

దీనిలో భాగంగా సీట్ల సర్దుబాటుతో పాటు ఇతర అంశాల్లో కూడా ఎక్కడా చిన్న సమస్య రాకుండా చూసుకున్నామ‌ని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించిన‌ట్లు బాబు పేర్కొన్నారు. 

మోదీ 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంద‌ని తెలిపారు. కేంద్రంలో మనం అనుకున్న ప్రభుత్వం రాకుండా ఉంటే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కష్టంగా ఉండేద‌ని చంద్రబాబు అన్నారు.  

మూడు పార్టీల ఆలోచనలు భిన్నంగా ఉన్నా.. ధ్యేయం రాష్ట్రాభివృద్ధే

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడింద‌ని మండిప‌డ్డారు. ఖర్చు పెట్టిన డబ్బుకు లెక్కలు చూపలేద‌ని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించార‌ని విమ‌ర్శించారు. చివ‌రికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామ‌ని తెలిపారు. 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లు సాధించడం త‌న‌ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడూ జరగలేద‌ని బాబు తెలిపారు. 

1994లో కూడా ఇంత మెజారిటీ రాలేద‌ని గుర్తు చేశారు. మూడు పార్టీలు అనుసరించిన విధానమే ఈ ఘన విజయానికి కారణమైంద‌ని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వారు మెచ్చుకునేలా మన నడవడిక ఉండాలని సీఎం అన్నారు. మూడు పార్టీలలో విభిన్న ఆలోచనలు ఉన్నా.. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు చంద్ర‌బాబు అన్నారు. 

100 రోజుల పాలనలో కూట‌మి ప్రభుత్వం ఏం చేసింది.. ఏం చేయబోతోందో కూడా ప్రజలకు వివరించాల‌ని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల‌కు బాబు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాల‌న్నారు. కూట‌మి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం  కలిగించాల‌ని చంద్రబాబు అన్నారు. 

ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీరు

నరేంద్ర మోదీ 3వ సారి ప్ర‌ధాని అయ్యి ధృడమైన సంకల్పంతో వికసిత్ భారత్-2047తో ముందుకు వెళ్తున్నార‌ని చంద్ర‌బాబు పేర్క‌న్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాలు, ఇతర మార్పులు తీసుకొస్తున్నారని గుర్తు చేశారు. వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టార‌న్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రాబోయే 3 ఏళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింద‌ని తెలిపారు. 

ప్ర‌జాప్ర‌తినిధులు వారివారి నియోజకవర్గాల పరిధిలో జాతీయ రహదారులను ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టుకునేలా కృషి చేయాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం 50 శాతం నిధులు ఇస్తోంద‌ని తెలిపారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బులు సరిగా ఖర్చు చేయకుండా పథకాన్ని రాష్ట్రంలో నిర్వీర్యం చేసింద‌ని బాబు విమ‌ర్శించారు. దీనిపై మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత నీళ్లు అందిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.  

అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు ఒక రికార్డ్

గతంలో స్థానిక సంస్థలకు రూ.990 కోట్ల నిధులను ఆర్థిక సంఘం ఇవ్వలేద‌ని గుర్తు చేసిన చంద్ర‌బాబు.. వాటిని కూడా కూట‌మి ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసింద‌ని తెలిపారు. మరో రూ.1100 కోట్లు కేంద్రం నుండి మ్యాచింగ్ గ్రాంట్‌గా వచ్చాయ‌న్నారు. అలాగే మరో రూ.2 వేల కోట్లను కేంద్రం అందిస్తుంద‌ని తెలిపారు. 

ఉపాధి హామీ పనిదినాలను ఆమోదించేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు పెట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారని, ఈ ఆలోచన రావడం అద్భుతం అని సీఎం ప్ర‌శంసించారు. రూ.4,500 కోట్ల పనులకు గ్రామసభల ద్వారా ఆమోదం కూడా తెలపడం ఒక చరిత్రగా పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేద‌ని, అందుకే వరల్డ్ రికార్డు లభించింద‌న్నారు.  గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ కోసం కేంద్రం రూ.49 వేల కోట్లు ఖర్చు చేస్తోంద‌ని,  రైల్వే లైన్లకు కూడా కేంద్రం నిధులు కేటాయిస్తుంద‌ని తెలిపారు. 

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం స్థలం ఇవ్వలేద‌ని, అందుకే జోన్ కార్యాలయం ఏర్పాటు కాలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అవసరమైన భూమి ఇచ్చిన‌ట్లు తెలిపారు. దాంతో త్వరలోనే రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తామని కేంద్రం తెలిపిందన్నారు. భారత ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెట్టింద‌ని సీఎం వివరించారు.  

గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.5 లక్షల ఉద్యోగాలు లక్ష్యం

పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్ పానెల్ ఏర్పాటు చేసుకుని 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తోందని ముఖ్య‌మంత్రి తెలిపారు. దీనికి కొంత మొత్తంలో లబ్ధిదారులు త‌మ‌ వాటాను కలుపుకుని ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో శాశ్వతంగా విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితి ఉండద‌న్నారు. దీన్ని ఒక ఉద్యమంలా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.

ఒకప్పుడు పొలాలకు సరిగా కరెంట్ లేని పరిస్థితి అని సీఎం తెలిపారు. కానీ ఇప్పుడు కుసుమ్ పథకం కింద పంపు సెట్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి ఉంద‌న్నారు. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ ద్వారా 72 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకెళ్తామ‌ని సీఎం చంద్రబాబు తెలిపారు.  

ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలి

విజన్ 2047 ద్వారా కేంద్రం వికసిత్ భారత్‌కు నాంది పలికింద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌తో 2047కి విజన్ సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. మనకు ఓట్లు వేసిన ప్రజలను అన్ని విధాలా పైకి తీసుకురావడానికి కష్టపడి పనిచేద్దామ‌న్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. 

దీనిలో భాగంగా 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గుదలకు ప్రణాళిక రూపొందించుకుందామ‌ని పేర్కొన్నారు. గత పాలకులు విచ్చలవిడిగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశార‌ని ఆరోపించారు. లక్ష కోట్ల బిల్లులు పెండింగులో పెట్టార‌ని, ఇలాంటి కష్టసమయంలో అధికారంలోకి వచ్చామ‌ని తెలిపారు. అయినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర సహకారంతో ముందుకు అడుగేస్తున్నామ‌ని చంద్రబాబు అన్నారు. 

చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలి

సీఎంగా బాధ్య‌తలు చేపట్టిన నాడు 5 ప్రధాన హామీల అమలుపై సంతకం చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు గుర్తు చేశారు. 16,347 ఉద్యోగాలతో డీఎస్సీ నిర్వహణకు శ్రీకారం చుట్టామ‌ని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తామ‌న్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పింఛ‌న్‌ వెయ్యి మాత్రమే పెంచింద‌ని తెలిపారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం ఒకేసారి వెయ్యి పెంచి ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలు కూడా ఇచ్చామ‌న్నారు. 

వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇవ్వలేరని ప్రచారం చేశార‌ని, స‌చివాలయాల చుట్టూ వృద్ధులను తిప్పి 35 మంది ప్రాణాలు తీశారంటూ చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం రాగానే వాలంటీర్లు లేకుండానే ప్రభుత్వ యంత్రాంగం స‌హాయంతో ఒకే రోజులో పింఛన్లు పంపిణీ చేశామ‌ని తెలిపారు. 

ప్రతి నెలా 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమం ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్న విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగులు గత ఐదేళ్లలో ఏనాడూ మొదటి తేదీన జీతం తీసుకోలేద‌ని,  కానీ కూట‌మి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఒకటవ తేదీన జీతాలు అందుతున్నాయ‌న్నారు. ఇలా మనం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల‌ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కోరారు. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశామ‌ని తెలిపారు. ఇదొక భయంకరమైన చట్టమ‌న్న చంద్ర‌బాబు.. సొంత మనుషుల్ని పెట్టుకుని రికార్డులు రాయడానికి గత పాలకులు చట్టం తెచ్చుకున్నారని దుయ్య‌బ‌ట్టారు. కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చట్టం చేశారంటూ విమ‌ర్శించారు. 

అందుకే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడామ‌ని తెలిపారు. రికార్డులను గత ప్రభుత్వం తారుమారు చేసి కొన్ని లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసి దోచుకున్నారని మండిప‌డ్డారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దశ్త్రాలు తగలబెట్టారని, తప్పులు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేర‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. 

రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్టగొట్టార‌ని మండిప‌డ్డారు. అందుకే నాలుగవ సంతకంలో భాగంగా 100 అన్న‌ క్యాంటీన్లు ఏర్పాటు చేశామ‌ని సీఎం గుర్తు చేశారు. వాటిని త్వరలోనే 203కు పెంచుతామ‌న్నారు. నైపుణ్య గణన చేస్తే బావుంటందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన సూచనలతో దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన చేపట్టబోతున్నామ‌ని చంద్ర‌బాబు ప్రకటించారు.

151 సీట్లు వచ్చాయని విర్రవీగిన వాళ్లను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు 

వైసీపీ ఐదేళ్ల విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టేందుకు ఏడు శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రజలకు పరిస్థితులను వివరించామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. వాలంటీర్ల పదవీ కాలం ఏడాది ముందే ముగిసింద‌ని, వాలంటీర్ల గురించి మాట్లాడే వ్యక్తి వాళ్లను రెన్యువల్ ఎందుకు చేయలేదు? అని బాబు ప్ర‌శ్నించారు. కొంతమందితో రాజీనామాలు చేయించార‌ని, మిగతా వాళ్లవి కాల పరమితి అయిపోయిన‌ట్లు తెలిపారు. 4 లక్షల మందితో నెలకు రూ. 200 చొప్పున సాక్షి పత్రికను కొనుగోలు చేయించార‌ని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎక్కడా జరగలేద‌న్నారు. 

ఆ పేపర్‌లో వేసే అసత్యాలు, అబద్ధాలను వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ప్రచారం చేశార‌ని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం ఎంత చేసినా, ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలని చూసినా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయ‌ని చెప్పారు. 151 సీట్లు వచ్చాయని విర్రవీగిని వారికి 11 సీట్లు వచ్చేలా చేశారంటే అదే ప్రజాస్వామ్య రహస్యమ‌న్నారు. ఉచిత ఇసుకను కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, వాటిపై ఇప్పుడు విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో వారు చేసిన తప్పులు కూట‌మి నేత‌లు చేయకూడద‌న్నారు. ఆయా నియోజకవర్గాల్లో నాయకులు జోక్యం చేసుకోకుండా ప్రజలకు ఇసుకను చేర్చగలిగితే అది మన గెలుపునకు దోహదం చేస్తుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. 

రెండేళ్లలో పోలవరం ఫేజ్ -1 పూర్తి చేసి జాతికి అంకితం

ఒక వ్యక్తి స్వలాభం కోసం మద్యం విధానాన్ని మార్చార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు. సొంత బ్రాండ్లు, సొంత డిస్టలరీలు ఏర్పాటు చేసుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. నాణ్యత లేని మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశార‌ని మండిప‌డ్డారు. అక్టోబరులో కొత్త మద్యంపాలసీ అమల్లోకి వస్తుంద‌ని, నాసిరకం మద్యాన్ని నిర్మూలిస్తామ‌ని తెలిపారు. కేంద్రం పోలవరానికి రూ.12,500 కోట్ల ప్రకటించింది. కొత్త డయాఫ్రం వాల్ కూడా నిర్మించాల్సి ఉంద‌న్నారు. రెండేళ్లలో పోలవరం ఫేజ్-1 పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 

పోలవరాన్ని పూర్తి చేసి రైతులకు, జాతికి అంకితం చేస్తామ‌న్నారు. అమరావతికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామ‌ని తెలిపారు. రాజధాని నిర్మాణానికి వరల్డ్ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్లు అందించేందుకు కేంద్రం ముందుకొచ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా సీఎం గుర్తు చేశారు. అలాగే కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించింద‌ని, ఈ పార్కుల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయ‌న్నారు. 

శ్రీసిటీలో 15 సంస్థలు ప్రారంభించి, మరో 6 సంస్థలకు శంకుస్థాపన చేసిన‌ట్లు తెలిపారు. బీపీసీఎల్ రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిందన్నారు. విశాఖపట్నం ఎన్టీపీసీ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకతతో ఉంద‌ని చంద్రబాబు తెలిపారు.  

పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన.. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

గతంలో గ్రామాల్లో 25 వేల కి.మీ సిమెంట్ రోడ్లు వేశామ‌న్న చంద్ర‌బాబు.. మ్యాచింగ్ ఇచ్చుకుంటే గ్రామాల్లో అన్ని పనులు చేసుకోవచ్చని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో 17 వేల కి.మీ సీసీ రోడ్లు, 10 వేల కి.మీ సీసీ డ్రెయిన్‌ల‌ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టిన రూ.1,670 కోట్లు చెల్లించిన‌ట్లు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూడా 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రైతులకు డ్రిప్ 90 శాతం సబ్సీడీతో అందిస్తామ‌ని చెప్పారు. 

రూ.340 కోట్లతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు చేస్తామ‌ని తెలిపారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే నాటి సీఎం కనీసం అక్కడికి వెళ్లలేద‌ని విమ‌ర్శించారు. పులిచింతల గేట్ కొట్టుకుపోతే రెండు సీజన్ల పాటు గేటు ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు. గుండ్లకమ్మ గేటు, తుంగభద్ర గేటు కొట్టకుపోయాయ‌న్నారు. సాగుకు నీళ్లు ఇవ్వలేమని అధికారులు ప్రకటించారు. కానీ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుని పంపి గేటు ఏర్పాటు చేసి నీటి వృధాను అడ్డుకున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సమస్యగా చేయడానికి చూస్తున్నార‌ని, గతంలో వాజ్ పేయ్ హయాంలో నిధులు కేటాయించి నష్టాల నుండి గట్టెక్కించామ‌ని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా చూస్తున్నామ‌ని హామీ ఇచ్చారు. నీరు చెట్టు, నరేగా బిల్లులు కూడా విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు. పోలీసు వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి జవాబుదారీతనం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లు ప్రతిపక్షాలపై  తప్పుడు కేసులు పెట్టి వేధించాయ‌ని మండిప‌డ్డారు. 

ముంబయిలో ఉన్న హీరోయిన్‌ను అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకుంటామ‌న్నారు. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు గౌరవ వేతనం పెంచామ‌న్న చంద్ర‌బాబు.. బీసీలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కూడా కేబినెట్‌లో ఆమోదించిన‌ట్లు తెలిపారు. దీన్ని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపుతామ‌ని తెలిపారు. అలాగే అర్చకుల వేతం రూ.10 వేల నుండి 15 వేలకు పెంచామ‌ని సీఎం చంద్రబాబు వివరించారు.  

ప్రతి ఒక్కరికీ ఇల్లు

రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామ‌ని హామీ సీఎం ఇచ్చారు. పెండింగులో ఉన్న ఇళ్లు పూర్తి చేయ‌డంతో పాటు ఒక్కో ఇంటి నిర్మాణానికి  రూ.4 లక్షలు ఇస్తామ‌న్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామ‌ని తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలను రాజముద్రతో రైతులకు అప్పగిస్తామ‌ని చెప్పారు. ఏ వ్యక్తి ఫోటోలు ఎక్కడా ఉండవ‌న్నారు. 2047 విజన్‌తో 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇది అసాధ్యం అంటున్నవారికి సుసాధ్యం చేసి చూపిస్తామ‌న్నారు. 

నూతన ఎంఎస్ఎంఈ విధానం, నూతన ఇండస్ట్రియల్ పాలసీలను త్వరలో తీసుకొస్తామ‌ని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో పోర్టులు, ఎయిర్ పోర్టులు చాలా ముఖ్యం అవుతాయ‌న్నారు. అన్ని ట్రస్ట్ బోర్డుల్లో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణులను నియమిస్తున్నామ‌ని చంద్రబాబు అన్నారు. 

వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడకం

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూను కూడా గత ఐదేళ్లు నాసిరకంగా మార్చార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు. వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశార‌ని మండిప‌డ్డారు. దేవుడు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడార‌ని ఆరోపించారు. వెంకటేశ్వరస్వామి ప్రతిష్టతను పెంచి పవిత్రతను కాపాడుతామ‌ని తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని, ముందుగా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రూ.500 కోట్లు మంజూరు చేసిన‌ట్లు గుర్తు చేశారు. 

ఇటీవ‌ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. త‌న‌ జీవితంలో చాలాసార్లు చూశాను కానీ, ఇంత పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్‌కు దాతలు ఏనాడూ విరాళాలు ఇవ్వలేద‌ని పేర్కొన్నారు. అలాగే కూటమి ఎమ్మెల్యేల తరపున కూడా ఒక నెల జీతం విరాళంగా ఇద్దామ‌న్నారు. బుడమేరు ప్రాంతంలో కబ్జాలు పెరగడమే వరద ముంపునకు ప్ర‌ధాన కార‌ణం అన్నారు. బుడమేరు మరమ్మతులకు నిధులు కేటాయిస్తే గత ప్రభుత్వం వాటిని రద్దు చేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. 

ప్రకృతి విలయం, గత పాలకుల తప్పిదాలు ప్రజలకు శాపంగా మారి 10 రోజులు నీళ్లలోనే ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 10 రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్‌లో ఉండి పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకొచ్చామ‌ని తెలిపారు. అందుకే ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని నిర్ణయించిన‌ట్లు సీఎం పేర్కొన్నారు. 25 కేజీల బియ్యం, 5 రకాల నిత్యవసర సరుకులు అందించిన‌ట్లు తెలిపారు. బుడమేరు గండ్లను పూడ్చేందుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, లోకేశ్ రేయింబవళ్ళు కష్టపడ్డార‌ని గుర్తు చేశారు. 

పాడైపోయిన ద్విచక్ర వాహనాల రిపేర్లకు రూ.3 వేలు ప్రకటిస్తే, టర్నోవర్‌ను బట్టి ఎంఎస్ఎంఈలకు ప్యాకేజీని ప్రకటించిన‌ట్లు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో వరద బాధితులకు ప్యాకేజీ ఎవరూ, ఎప్పుడూ ఇవ్వ‌లేద‌ని తెలిపారు. పంటలకు కూడా మొదటిసారి హెక్టారకు రూ.25 వేలు పరిహారం ప్రకటించామ‌న్న ముఖ్య‌మంత్రి.. నష్టపోయిన కౌలు రైతులకే నేరుగా పరిహారం అందిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. 

దీపావళి పండుగ కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం

సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి పండుగ రోజున మొదటి గ్యాస్ అందిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. మిగిలిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు క్రమేనా అమలు చేస్తామ‌న్నారు. మనపై ప్ర‌జ‌లు పవిత్రమైన‌ బాధ్యత పెట్టార‌న్న బాబు.. ప్రతి అడుగూ వారి కోసం వేయాల‌ని తెలిపారు. అనునిత్యం పేదల కోసం పని చేయాల‌న్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, ఈ వంద రోజుల పాటు ప్ర‌జాప్ర‌తినిధులు చూపించిన సమన్వయం అమోఘం అని కొనియాడారు. దీన్ని మరింత దృఢత్వంతో ముందుకు తీసుకెళ్లాల‌ని కోరారు. 

వైసీపీ అనునిత్యం విషం కక్కే పనిలో ఉంది. ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా తిప్పికొట్టాల‌ని సీఎం తెలిపారు. వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్రజలకు వాస్తవాలను వివరించాల‌ని సూచించారు. సొంత బాబాయిని చంపి గుండెపోటు అని మొదట చెప్పి సాయంత్రానికి నారాసుర రక్త చరిత్ర అని దొంగ పత్రికలో రాసుకున్నారని గుర్తు చేశారు. క్రూరంగా చంపిన విషయాన్ని దాచి ప్రజలను మభ్యపెట్టారంటూ జ‌గ‌న్‌ను ద‌య్యబ‌ట్టారు. ఇలాంటి వారి వల్ల కలిగే నష్టాలేంటో ప్రజలకు వివరించాల‌ని చెప్పారు. 

త్వరలోనే నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామ‌న్నారు. గుజరాత్‌లో స్థిరప్రభుత్వం కొనసాగడం వల్ల అభివృద్ధి సాధ్య‌మైంద‌ని బాబు తెలిపారు. 175కు 175 సీట్లు మనమే గెలుస్తాం. 40 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని చెప్పాం. స్థిరమైన ప్రభుత్వం వల్ల అభివృద్ధి చేసుకోగలుగుతాం. త్వరలోనే జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను నియమిస్తామ‌ని అన్నారు. జిల్లాల వారీగా మూడు పార్టీల అధ్యక్షులు సమన్వయంతో పని చేయాలని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.  

తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయ‌ని, త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామ‌న్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు చేరవేయాల‌ని చంద్రబాబు నాయుడు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కోరారు.

  • Loading...

More Telugu News