Balineni Srinivasa Reddy: వైసీపీకి భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన బాలినేని

Balineni Srinivasa Reddy resigns to YSRCP

  • రాజీనామా లేఖను జగన్ కు పంపించిన బాలినేని
  • కొంత కాలంగా వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న బాలినేని
  • బాలినేని జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం

వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. 

కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో పార్టీ నాయకత్వంపై ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పటికే బాలినేని అనుచరులు చాలా మంది వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. బాలినేని ఒంగోలు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ఉమ్మడి ఏపీలో బాలినేని మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి ఆయన వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది... రెండున్నరేళ్ల పాటు మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 

వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పబోతున్నారని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైవీ సుబ్బారెడ్డితో కూడా బాలినేనికి విభేదాలు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఇటీవలే జగన్ ను కూడా బాలినేని కలిశారు. ఇద్దరి మధ్య దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి. జగన్ బుజ్జగించినప్పటికీ బాలినేనిలో మార్పు రాలేదు. 

మరోవైపు నిన్న జనసేన నేత నాగబాబును బాలినేని కలిసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటి తర్వాత ఆయన వైసీపీని వీడారు. బాలినేని ఏ పార్టీలో చేరతారనే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News