Meerut: కూలిన మూడంతస్తుల భవనం... 10 మంది సజీవ సమాధి

10 dead in Meerut house collapse

  • ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌‌లో ఘటన
  • కూలిన 50 ఏళ్ల నాటి శిథిల భవనం
  • మృతుల్లో ఆరుగురు చిన్నారులు
  • మరో ఐదుగురి పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు చిన్నారులు సహా పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

స్థానిక జకీర్ కాలనీలో ఉన్న ఈ భవనం 50 ఏళ్ల నాటిది. శిథిల పరిస్థితుల్లో ఉన్న భవనం గత సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కింద ఓ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో ఒక కుటుంబం మొత్తం సమాధి అయిపోయింది. కొన్ని పశువులు మృత్యువాత పడ్డాయి. 

సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక పక్క వర్షం పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. స్థానిక వలంటీర్లు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. 

అర్ధరాత్రి 2 గంటల వరకు శిథిలాలు తొలగించగా, ఈ ఉదయం మళ్లీ ప్రారంభమయ్యాయి. కూలిన భవనం ఇరుకు ప్రదేశంలో ఉండడంతో బుల్డోజర్లు అక్కడి వెళ్లలేకపోతున్నాయని పోలీసులు తెలిపారు. 

తీవ్రంగా గాయపడిన ఐదుగురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన నఫీసా (63), ఫర్హానా (20), అలీసా (18), సాజిద్ (40), సానియా (15), సాఖిబ్ (11), సిమ్రన్ (15 నెలలు), ఆలియా (6), రిజా (7), రిమ్సా (5 నెలలు) గా గుర్తించారు. భవనం కూలిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News