Team India: 92 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డుకు అడుగు దూరంలో భార‌త్‌.. బంగ్లాపై తొలి టెస్టు గెలిస్తే చ‌రిత్రే!

India 1 Win Away From Sensational Test Cricket Feat First Time In 92 Years

  • టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు 579 మ్యాచ్‌లు ఆడిన భార‌త్‌
  • ఇందులో 178 మ్యాచుల్లో ఓడి, సరిగ్గా 178 మ్యాచుల్లో గెలిచిన టీమిండియా
  • మిగిలిన 223 మ్యాచుల్లో 222 టెస్టులు డ్రాగా ముగియగా ఒక మ్యాచ్ టై
  • బంగ్లాపై టెస్టు గెలిస్తే తొలిసారి ఓట‌ముల కన్నా విజయాలు ఎక్కువగా అందుకున్న జట్టుగా రికార్డు
  • ఈ రికార్డును వ‌చ్చే టెస్టులో సాధిస్తే 1932 తర్వాత ఇదే తొలిసారి  

45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు ఈ నెల 19న‌ చెన్నైలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు ఆడ‌నుంది. దీనికోసం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా శుక్రవారం చెన్నైలో ప్రాక్టీస్ మొద‌లుపెట్టింది. హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిదంబరం స్టేడియంలో శిక్షణా కార్యక్రమంలో పాల్గొంది. కాగా, జులైలో రాహుల్ ద్రవిడ్ నుంచి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతీకి ఇదే తొలి టెస్టు అసైన్‌మెంట్ కూడా. 

ఇదిలాఉంటే.. 1932లో తొలిసారిగా టెస్టు ఆడిన‌ భార‌త్ ఇప్పటివరకు 579 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 178 మ్యాచుల్లో గెలిచిన భారత్ జట్టు, సరిగ్గా 178 మ్యాచుల్లో ఓడిపోయింది. మిగిలిన 223 మ్యాచుల్లో 222 టెస్టులు డ్రాగా ముగియగా ఒక మ్యాచ్ టై అయింది. అంటే చెన్నై వేదికగా ఈ నెల 19 నుంచి బంగ్లాతో జరిగే తొలి టెస్టులో గెలిస్తే, టెస్టు క్రికెట్‌లో ఓటముల కన్నా విజయాలను ఎక్కువగా అందుకున్న జట్టుగా టీమిండియా రికార్డుకు ఎక్కుతుంది. ఇప్పటి వరకు ఈ రికార్డును భారత్ అందుకోలేక‌పోయింది. ఒకవేళ ఈ రికార్డును వ‌చ్చే టెస్టులో సాధిస్తే 1932 తర్వాత ఇదే తొలిసారి అవుతుంది. అంటే 92 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుందన్న మాట.

ఇక కీలకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లకు ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ చాలా కీల‌కం. ఇందులో భార‌త్ గెలిస్తే త‌న పాయింట్ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చుకుంటుంది. ప్రస్తుతం భారత్ 68.52 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, ఆస్ట్రేలియా 62.50 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

మ‌రోవైపు పాక్‌పై టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లా టైగ‌ర్స్‌ 45.83 పాయింట్ల‌తో టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి ఎగ‌బాకారు. దీంతో ఆ జ‌ట్టు కూడా భార‌త్‌తో టెస్టు సిరీస్‌ను కీల‌కంగా భావిస్తోంది. ఒక‌వేళ టీమిండియాపై గెలిస్తే ఆ జ‌ట్టు పాయింట్లు మెరుగవుతాయి. 

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, ర‌వీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ , మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

  • Loading...

More Telugu News