Padi Kaushik Reddy: దానం నాగేందర్ బిచ్చగాడు... కడియం శ్రీహరి మోసగాడు: పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Padi Koushik Reddy hot comments on Kadiyam and Danam

  • పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు వస్తాయని భయపడుతున్నారన్న ఎమ్మెల్యే
  • హైకోర్టు ఇచ్చిన గడువులోగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పాడి కౌశిక్ రెడ్డి
  • కేసీఆర్ వద్ద బ్యాగులు తీసుకొని సాయంత్రానికల్లా కడియం కాంగ్రెస్‌లో చేరారని ఆరోపణ

పూటకో పార్టీ మార్చే దానం నాగేందర్ బిచ్చగాడు... చీటర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కేపీ వివేకానందతో కలిసి వెళ్లి ఆయన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కోరారు. అనంతరం మాట్లాడుతూ... పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉపఎన్నికలు వస్తాయని భయపడిపోతున్నారన్నారు.

తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చిందని గుర్తు చేశారు. చర్యలు తీసుకోకుంటే సుమోటోగా కేసు స్వీకరిస్తామని హైకోర్టు చెప్పిన విషయాన్ని నరసింహాచార్యులకు వివరించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. 

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏమాత్రం సిగ్గులేదని కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు... కేసీఆర్ వద్ద ఉదయం పూట బ్యాగులు తీసుకొని సాయంత్రానికల్లా కాంగ్రెస్‌లో చేరారని ఆరోపించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో శ్రీహరి కనీసం డిపాజిట్ తెచ్చుకొని చూపించాలని సవాల్ చేశారు.

కాంగ్రెస్‌లో చేరినట్లు స్వయంగా చెప్పిన అరికెపూడి గాంధీ ఇప్పుడు మాట మార్చడం విడ్డూరమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయం వెలువరించేదాకా ఆగకుండా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులైతే తెలంగాణ భవన్‌కు రావాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

కేసీఆర్ గతంలో విడివిడిగా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానన్నారు. తమ హయాంలో సీఎల్పీ... బీఆర్ఎస్ పార్టీలో విలీనమైందన్నారు.

అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలి

అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మరో ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసే విధంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

దానం నాగేందర్, కడియం శ్రీహరి, అరికెపూడి గాంధీ మినహా మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై కాలయాపన వద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. పార్టీ మారితే అనర్హత వేటు పడాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News