Pendyala Srinivas: చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ పై సస్పెన్షన్ ఎత్తివేత.. సస్పెన్షన్ కాలం ఆన్ డ్యూటీగా మార్పు

Suspension lifted on Chandrababu PS Pendyala Srinivas

  • ఎన్నికలకు ముందు పెండ్యాలను సస్పెండ్ చేసిన గత వైసీపీ ప్రభుత్వం
  • చంద్రబాబు వద్ద 15 ఏళ్లకు పైగా పీఎస్ గా పని చేసిన పెండ్యాల
  • శ్రీనివాస్ ను ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా నియమించిన ప్రభుత్వం

గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు పీఎస్ గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఉన్న విచారణను సైతం ఆపేశారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పీఎస్ గా 15 ఏళ్లకు పైగా పెండ్యాల పని చేశారు. వైసీపీ హయాంలో 4 సార్లు ఆయన సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. 

2023 సెప్టెంబర్ 29న అప్పటి వైసీపీ ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. 2023 అక్టోబర్ 26న ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. విధులకు గైర్హాజరు అయ్యారని, అనుమతులు లేకుండానే దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లారని ఆయనపై అభియోగాలు మోపారు. ఈ క్రమంలో, 2024 జనవరి 8న పెండ్యాల శ్రీనివాస్ పై విచారణ జరిపేందుకు విచారణాధికారిని నియమించారు. 2024 ఆగస్ట్ 1న విచారణాధికారి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. శ్రీనివాస్ పై ఉన్న అభియోగాలు కొంత వరకు నిరూపితమయ్యాయని సదరు విచారణాధికారి తన నివేదికలో పేర్కొన్నారు. 

ఈ క్రమంలో శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. శ్రీనివాస్ పై కొన్ని అభియోగాలు కొంత వరకు నిరూపితమయ్యాయన్న విచారణ నివేదికలోని అంశంపై స్పందిస్తూ... మరోసారి అలాంటివి పునరావృతం కాకూడదని శ్రీనివాస్ కు సూచించింది. ఆయనను విధుల్లోకి తీసుకుంటున్నట్టు జీవోలో పేర్కొంది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఆయనను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News