USA: అమెరికాలో విషాద‌క‌ర ఘ‌ట‌న‌.. నీట మునిగి ఇద్ద‌రు తెలుగు చిన్నారుల మృత్యువాత‌!

Two Telugu Children Died in New York

  • న్యూయార్క్ లాంగ్ ఐలాండ్‌లోని హోల్ట్స్‌విల్లేలో ఘ‌ట‌న‌
  • అక్క‌డి ఓ అపార్ట్‌మెంట్‌లో డేవిడ్‌, సుధా గాలి అనే తెలుగు దంప‌తుల నివాసం
  • ఈ దంప‌తుల‌కు రూత్ ఎవాంజెలిన్ గాలి (4), సెలాహ్ గ్రేస్ గాలి అనే ఇద్ద‌రు కుమార్తెలు 
  • గ‌త శ‌నివారం ఇంటి నుంచి ఆడుకోవడానికి బ‌య‌ట‌కు వెళ్లిన చిన్నారులు
  • ఇంటి స‌మీపంలోని స‌ర‌స్సులో మునిగి మృతి

అమెరికాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ స‌ర‌స్సులో మునిగి ఇద్ద‌రు తెలుగు చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. గ‌త శ‌నివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్‌లోని హోల్ట్స్‌విల్లేలోని ఓ అపార్ట్‌మెంట్‌లో డేవిడ్‌, సుధా గాలి అనే తెలుగు దంప‌తులు నివ‌సిస్తున్నారు. 

ఈ దంప‌తుల‌కు రూత్ ఎవాంజెలిన్ గాలి (4), సెలాహ్ గ్రేస్ గాలి (2) అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. శ‌నివారం రోజు వారిద్ద‌రూ ఆడుకునేందుకు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. కానీ ఎంత‌సేప‌టికి ఆ చిన్నారులు తిరిగి ఇంటికి రాలేదు. దాంతో త‌ల్లి వారి కోసం ఇంటి చుట్టుప‌క్క‌లంతా వెతికింది. క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ప్పిపోయి ఉంటార‌ని భావించి వెంట‌నే 911కి కాల్ చేసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. 

ఆమె స‌మాచారం మేర‌కు పోలీసులు రెస్క్యూ సిబ్బందితో అక్క‌డికి చేరుకున్నారు. అనంత‌రం తెలుగు దంప‌తులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ స‌మీప ప్రాంతాల‌లో వెతికారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు చిన్నారులు అపార్ట్‌మెంట్ స‌మీపంలోని స‌ర‌స్సులోని నీటిపై తేలియాడుతూ క‌నిపించారు. 

వెంట‌నే వారిని బ‌య‌ట‌కుతీసి ద‌గ్గ‌రిలోని స్టోనీబ్రూక్ యూనివ‌ర్సిటీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వారిని ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే పిల్ల‌లు చనిపోయిన‌ట్లు నిర్ధారించారు. ఇద్ద‌రు కుమార్తెల‌ను పోగొట్టుకున్న త‌ల్లి సుధా గాలి గుండెల‌విసెలా రోదించడం అక్క‌డివారిని క‌లిచివేసింది.

ఇక మీడియా స‌మాచారం ప్ర‌కారం చిన్నారుల తండ్రి డేవిడ్‌ వీసా స‌మ‌స్య కార‌ణంగా స్వ‌దేశంలోనే ఉన్న‌ట్లు తెలిసింది. అత్యవ‌స‌ర వీసాపై అమెరికా వెళ్లాల్సి ఉన్నా అది కుద‌ర‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఇండియాలోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. క్రిస్ట్‌ఫ‌ర్‌లైఫ్ చ‌ర్చ్ అనే నిధుల సేక‌ర‌ణ సంస్థ స‌మాచారం ప్ర‌కారం డేవిడ్‌ను ఎమ‌ర్జెన్సీ వీసాపై అమెరికాకు ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఆయ‌న యూఎస్ వెళ్లిన త‌ర్వాతే చిన్నారుల అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం.

  • Loading...

More Telugu News