Duvvada Srinivas: దువ్వాడ ఇంటి బాల్కనీలో కనిపించిన మాధురి... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దువ్వాడ భార్య, కుమార్తెలు

Once again Duvvada issue highlighted in media after Divvele Madhuri appearance

  • రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ వ్యవహారం
  • దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం!
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భార్యాబిడ్డలు
  • కొత్త ఇంట్లోకి ప్రవేశించేందుకు దువ్వాడ భార్య వాణి ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్న వ్యవహారం ఇటీవల రచ్చకెక్కడం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్... దివ్వెల మాధురి అనే మహిళతో కలిసి ఉండడం పట్ల ఆయన భార్యాబిడ్డలు వీధికెక్కారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. 

ఆ తర్వాత దువ్వాడ భార్య వాణి... భర్తతో కలిసి ఉండేందుకు అంగీకరించారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. దువ్వాడ మాత్రం ససేమిరా అంటున్నారు. తనను బజారుకీడ్చిన వాణితో ఇక తాను కలిసి ఉండలేనని ఆయన చెబుతున్నారు. 

తాజాగా, దివ్వెల మాధురి ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి బాల్కనీలో కనిపించడంతో మళ్లీ రభస మొదలైంది. దీనిపై దువ్వాడ భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, ఇవాళ దివ్వెల మాధురి కనిపించిన ఇంటిని కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే మాధురి పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా వాణి, ఆమె ఇద్దరు కుమార్తెలు ఈ ఇంటి ముందే నిరసన కొనసాగిస్తున్నారు. 

తాజాగా ఆ ఇంటికి దివ్వెల మాధురి రావడంతో వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు వాణి, ఆమె కుమార్తెలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అయితే, ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని వాణి చెబుతున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వాణి, ఆమె కుమార్తెలను అక్కడ్నించి బలవంతంగా తరలించారు.

ఈ నూతన ఇంటిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయం అని చెబుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News