Uttar Pradesh: మేనల్లుడు లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పినందుకు.. గుండు గీయించి కర్రలతో దాడిచేసిన భర్త, కుటుంబ సభ్యులు

UP woman beaten head shaved after complaining of nephew harassment

  • ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘటన
  • గుమికూడిన జనం ముందే భార్యకు శిరోముండనం చేసి కర్రలతో దాడి
  • బాధతో విలవిల్లాడుతున్న ఆమెను వంతుల వారీగా చావగొట్టిన నిందితులు
  • ఆరుగురు నిందితుల అరెస్ట్

మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పడమే ఆమె పాపమైంది. ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేసి శిరోముండనం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదికాస్తా పోలీసులకు చేరడంతో మహిళ భర్త సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ నెల 3న ఈ ఘటన జరిగినప్పటికీ వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళకు గుండు గీసి, కాళ్లుచేతులు కట్టేయడం వీడియోలో కనిపించింది. గుమికూడిన జనం ముందే భర్త ఆమెను కర్రతో చావబాదాడు. బాధతో విలవిల్లాడుతున్న ఆమెపై నిందితులు వంతుల వారీగా దాడిచేశారు. 

మేనల్లుడు రాజనాథ కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ విషయం చెప్పినందుకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెకు శిరోముండనం చేయించి కర్రలతో చావగొట్టారు. వీడియో పోలీసులకు చేరడంతో వారు వెంటనే స్పందించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి భర్త సహా ఆరుగురిని అరెస్ట్ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News