Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu and Pawan Kalyan wishes Telugu people on Vinayaka Chavithi

  • సెప్టెంబరు 7న వినాయకచవితి
  • వినాయక చవితి పందిళ్లు కళకళలాడాల్సిన సమయంలో వరదలు వచ్చాయన్న చంద్రబాబు
  • ఇక ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని గణేశుడిని కోరుకుంటున్నట్టు వెల్లడి
  • వినాయక చవితి ఆనందదాయకంగా జరుపుకునే పరిస్థితులు లేవన్న పవన్ కల్యాణ్

రేపు (సెప్టెంబరు 7) వినాయక చవితి పండుగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

వాడవాడలా చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 

రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ వక్రతుండ మహా గణపతిని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. విఘ్నాలను అధిగమించి, రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఇక, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ... తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడిని మనసారా వేడుకుంటూ సకల జనులకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వివరించారు. 

ఏపీ ప్రజలు వరదలతో భీతిల్లుతున్న తరుణంలో వచ్చిన ఈ వినాయక చవితిని భక్తిప్రపత్తులతో ఆనందదాయకంగా జరుపుకునే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమని జనసేనాని విచారం వ్యక్తం చేశారు. అందువల్ల వినాయక పందిళ్లను ఆడంబరంగా, ఆర్భాటాలకు పోకుండా సంప్రదాయబద్ధంగా పరిమితంగా చేసుకుని, ఆ విధంగా మిగిలిన నిధులను వరద బాధితులను ఆదుకోవడానికి వినియోగించాలని మనవి చేశారు. 

మట్టి వినాయక ప్రతిమలనే పూజించండి అని ఎప్పట్లాగే ఇప్పుడూ చెబుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నీటిలో కరగని కృత్రిమ పదార్థాలతో రూపొందించిన ప్రతిమలను ప్రోత్సహించవద్దని పిలుపునిచ్చారు. మన భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించాలన్న సంకల్పాన్ని విస్మరించవద్దని సూచించారు. 

వరదలు, కరవు కాటకాలు లేని భవిష్యత్తును ప్రసాదించమని "నమామి తమ్ వినాయకం" అని ప్రార్థిస్తూ జనులందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News