Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం

Road accident kills 12 people in Uttar Pradesh

  • బస్సును ఢీకొట్టిన లోడర్ వాహనం
  • మృతుల్లో చిన్న పిల్లలు
  • 16 మందికి గాయాలు
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించిన కేంద్రం

ఉత్తరప్రదేశ్ లో రహదారి రక్తదాహం పలువురిని బలిగొంది! యూపీలోని హత్రాస్ లో ఓ బస్సును లోడర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ముందు వెళుతున్న బస్సును లోడర్ వాహనం ఓవర్ టేక్ చేయబోయిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 

మరణించిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. ఆగ్రా-అలీగఢ్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మందికి గాయాలు కాగా, వారిని సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

కాగా, రోడ్డు ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం

ఉత్తరప్రదేశ్ రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా స్పందించింది. యూపీలోని హత్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం అని ప్రధాని మోదీ పేర్కొన్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. పీఎంఎన్ఆర్ఎఫ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల సాయం అందించనున్నట్టు పీఎంవో ప్రకటించింది.

  • Loading...

More Telugu News