AP Police: వరదలపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తాం: ఏపీ పోలీస్ హెచ్చరిక

AP Police warns rumour mongers over Vijayawada floods

  • విజయవాడ ముంపు ప్రాంతాల్లో ఇళ్లలో పేరుకుపోయిన బురద
  • క్లీన్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది
  • కులం అడిగి క్లీన్ చేయడం ఏంట్రా బాబూ అంటూ ఓ వ్యక్తి ట్వీట్
  • తీవ్ర స్థాయిలో స్పందించిన పోలీస్ శాఖ

విజయవాడలో బుడమేరు ఉప్పొంగడంతో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి బురద పేరుకుపోయింది. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఇళ్లను శుభ్రం చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందంటూ ఏపీ పోలీస్ పేర్కొంది. 

విపత్తు సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేసింది. వరద బీభత్సంతో లక్షలాది మంది ప్రజలు బాధలు పడుతున్న వేళ ఇలాంటి ప్రచారం క్షమించరానిదని పోలీస్ శాఖ పేర్కొంది. 

పుకార్లు పుట్టించి వ్యాప్తి చేసేవారిపైనా, క్లిష్ట సమయాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే సంఘ వ్యతిరేక శక్తులపైనా తీవ్రస్థాయిలో న్యాయపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 

కాగా, సోషల్ మీడియాలో ఓ వ్యక్తి... "విజయవాడలో నీట మునిగిన కాలనీలను క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్లు కులం అడిగి చేయడం ఏంట్రా బాబూ?" అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను ప్రస్తావిస్తూ ఏపీ పోలీస్ శాఖ పైవిధంగా స్పందించింది.

AP Police
Rumour Mongers
Vijayawada Floods

More Telugu News