YSRCP: వైసీపీ నేత నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

Nandigam Suresh remanded in 14 day judicial custody

  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో హైదరాబాద్‌లో వైసీపీ నేత అరెస్ట్
  • నందిగం సురేశ్‌ను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • 2014 నుంచి టీడీపీ తనను వేధిస్తోందన్న మాజీ ఎంపీ

వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

బుధవారం నుంచి నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత తన ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించింది.

టీడీపీ నన్ను వేధిస్తోంది: నందిగం సురేశ్

తెలుగుదేశం పార్టీ తనను 2014 నుంచి వేధిస్తోందని నందిగం సురేశ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కాగా, వైసీపీ నేతను పోలీసులు కాసేపట్లో గుంటూరు జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఆయనను తమ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.

YSRCP
Telugudesam
Nandigam Suresh
  • Loading...

More Telugu News