Balusu Srinivasa Rao: సీఎం చంద్రబాబుకు రూ.1 కోటి విరాళం చెక్ అందించిన బీఎస్సాఆర్ ఇన్ ఫ్రా ఎండీ

BSR Infrastructure MD Balusu Srinivasa Rao donates Rs 1 crore to Vijayawada flood victims

  • విజయవాడలో వరద విలయం
  • లక్షలాది మందిపై ప్రభావం
  • భారీగా ముందుకు వస్తున్న దాతలు

విజయవాడ వరద బాధితుల కడగండ్లు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. తాజాగా, బీఎస్సార్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు వరద బాధితుల సహాయార్థం రూ.1 కోటి విరాళం ప్రకటించారు. 

ఇవాళ ఆయన సీఎం చంద్రబాబును కలిసి విరాళం తాలూకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా బలుసు శ్రీనివాసరావును చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. వరద బాధితుల కోసం పెద్ద మనసుతో ముందుకొచ్చిన ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఇక, రూ.25 లక్షలు విరాళం అందించిన సినీ నిర్మాత అశ్వినీదత్ కు, రూ.25 లక్షలు విరాళం అందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం వారికి కూడా చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ కష్టకాలంలో మీరు అందిస్తున్న మద్దతు నిజంగా అభినందనీయం అని కొనియాడారు. ఈ విరాళాలు వరద బాధితులకు ఎంతో ఊరటనిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. 

క్లిష్ట సమయంలో చాలా సంస్థలు, వ్యక్తులు విరాళాలతో ముందుకు వస్తున్నారని, వారందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వివరించారు.

  • Loading...

More Telugu News