Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజేత ఎవరో అంచనా వేసిన గవాస్కర్

Sunil Gavaskar predicts Border Gavaskar Trophy winner

  • ఈ ఏడాది నవంబరు 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
  • ఐదు టెస్టుల సిరీస్ లో అమీతుమీ తేల్చుకోనున్న టీమిండియా-ఆసీస్
  • టీమిండియా 3-1 తేడాతో సిరీస్ గెలుస్తుందన్న గవాస్కర్ 

టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఏడాది నవంబరు 22న ప్రారంభం కానున్న ఈ ఐదు టెస్టుల సిరీస్ వచ్చే ఏడాది జనవరి 7న ముగియనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. 

ఇప్పటికే టీమిండియా 2018-19, 2020-21 సీజన్లలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండుసార్లు గెలిచి సత్తా చాటింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. 

కాగా, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియా-ఆసీస్ టెస్ట్ సిరీస్ పై స్పందించాడు. సిరీస్ విజేత ఎవరో జోస్యం చెప్పాడు. ఈ సిరీస్ ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంటుందని అంచనా వేశాడు. 

ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదని, రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారని వెల్లడించాడు. అంతేకాదు, క్రికెట్ లో టెస్టు ఫార్మాట్ ను అత్యధికంగా ఎందుకు ఇష్టపడతారో ఈ సిరీస్ చాటిచెబుతుందని గవాస్కర్ పేర్కొన్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లేని లోటు భర్తీ చేయడం కష్టమని అభిప్రాయపడ్డాడు. టీమిండియాతో సిరీస్ లో ఆసీస్ కు ఓపెనింగ్ సమస్యలు మరింత అధికమవుతాయని అన్నాడు. 

టీమిండియా గురించి చెబుతూ, విదేశీ పర్యటలను టీమిండియా నిదానంగా ఆరంభిస్తుందని, అందుకే తొలి టెస్టు కీలకమని భావిస్తున్నానని గవాస్కర్ తెలిపాడు.

  • Loading...

More Telugu News