YS Jagan: వైసీపీ చీఫ్ జగన్‌కు నోటీసులు ఇచ్చారనే ప్రచారంపై స్పందించిన హైడ్రా కమిషనర్

Hydra commissioner on notices to YS Jagan

  • సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం జరుగుతోందన్న రంగనాథ్
  • పటాన్‌చెరులో పర్యటించిన హైడ్రా కమిషనర్
  • తూములను బంద్ చేసి మరీ అపార్ట్‌మెంట్లను నిర్మించారని వెల్లడి
  • ఈర్ల చెరువు, అప్పా చెరువుల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • బీజేపీ కార్పోరేటర్ షెడ్డును కూల్చేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు నోటీసులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. నోటీసులు ఇవ్వలేదని, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం సాగుతోందని వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్ చెరువు శిఖంలో ఇంటిని నిర్మించినట్లు ఆరోపణలు రావడంతో నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం సాగింది. దీనిపై రంగనాథ్ వివరణ ఇచ్చారు.

రంగనాథ్ శనివారం ఉదయం పటాన్‌చెరులో పర్యటించారు. అధికారులతో కలిసి స్థానిక సాకి చెరువును పరిశీలించారు. కబ్జాకు గురైన ప్రాంతం గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ చెరువులో ఇప్పటికే 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. చెరువు తూములను బంద్ చేసి మరీ నిర్మించిన ఆపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయన్నారు. ఇన్‌కోర్ సంస్థ తూములను బంద్ చేసి అపార్టుమెంట్ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ అపార్ట్‌మెంట్‌ను కూడా రంగనాథ్ పరిశీలించారు.

మదీనగూడలో కూల్చివేతలు

మదీనగూడలోని వైశాలి నగర్‌లో గల ఈర్ల చెరువు బఫర్ జోన్‌లో నిర్మించిన మూడు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. గగన్ పహాడ్‌లోని అప్పా చెరువులో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని ఆక్రమించి నిర్మించిన షెడ్లను, ఇతర నిర్మాణాలను కూల్చివేసింది. బీజేపీ కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి చెందిన షెడ్డును కూడా కూల్చివేసింది.

వాస్తవానికి అప్పా చెరువు 34 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, కానీ దశాబ్దాలుగా అక్రమ నిర్మాణలు జరగడంతో ఈ చెరువు ఇప్పుడు 10 నుంచి 12 ఎకరాలకు తగ్గిపోయిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చెరువును ఆక్రమించి నిర్మాణాలు జరగడంతో 2020 అక్టోబర్‌లో వచ్చిన వరదల కారణంగా గణనీయ ఆస్తి నష్టం జరిగిందన్నారు.

YS Jagan
HYDRA
Hyderabad
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News