HYDRA: హైడ్రా కూల్చివేతలపై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన

HYDRA limits are ORR says CS Shanti Kumari announced

  • హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు అని వెల్లడి
  • చెరువులు, పార్కులు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత అప్పగించనున్నట్లు స్పష్టత
  • నోటీసుల జారీ, తొలగింపు చర్యలన్నీ హైడ్రా పరిధిలోకే తీసుకురానున్నట్లు శాంతికుమారి వెల్లడి

హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. హైడ్రా పరిధికి సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఇక నుంచి నోటీసులన్నీ హైడ్రా ద్వారా జారీ చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేయాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం శాంతికుమారి ఆదేశించారు. నోటీసుల జారీ, తొలగింపు చర్యలు అన్నీ ఒకే విభాగంగా ఉండాలని, అవన్నీ హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. ఇక హైడ్రా పరిధి ఓఆర్‌ఆర్‌ వరకు ఉంటుందని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. చెరువుల్లో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై ఈ మధ్య హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసేందుకుగానూ సీఎస్‌ శాంతికుమారి గురువారం సమీక్ష నిర్వహించారు. హైడ్రాకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో చర్చించారు.

ఆక్రమణల తొలగింపునకు నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్.. ఇలా వేర్వేరు విభాగాలు నోటీసులు జారీ చేస్తుండడంతో సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే అన్నీ అనుమతులు హైడ్రాకు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వివరించారు. హైడ్రా తన పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ హైడ్రా చూసుకోనుందని, ఈ మేరకు పూర్తిస్థాయిలో బాధ్యతను హైడ్రాకు అప్పగించనున్నట్లు ఆమె వివరించారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌ చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుతం వీటి పరిరక్షణ జలమండలి పరిధిలో ఉందని ఆమె ప్రస్తావించారు.

త్వరలోనే సిబ్బంది కేటాయింపు..
అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని భావిస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. అంతేకాదు సిబ్బందిని కేటాయిస్తామని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తామని ఆమె వివరించారు. పోలీసు, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని త్వరలో కేటాయిస్తామని తెలిపారు. హైడ్రా పరిధిలో 72 బృందాలు ఏర్పాటు అయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News