YS Sharmila: విషజ్వరాలు వణికిస్తుంటే కూటమి సర్కారుకి సూది గుచ్చినట్టయినా లేదు: వైఎస్ షర్మిల

APCC president YS Sharmila criticized the coalition government

  • రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్‌గా మారిందన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు
  • సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్
  • పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షించాలని సూచించిన షర్మిల

రాష్ట్రాన్ని విష జ్వరాలు వణికిస్తుంటే కూటమి సర్కారుకి కనీసం సూది గుచ్చినట్టయినా లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యాతో రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్‌గా మారిందని, అయినా వైద్యారోగ్య శాఖ ఇంకా నిద్ర మత్తు వీడలేదని మండిపడ్డారు. 

పల్లెలు మంచం పట్టాయని, బాధితులతో ఆసుపత్రులు నిండిపోయాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న దీనస్థితి ఉందన్నారు. ఓపీ ఫుల్... వైద్యం నిల్ అన్నట్లుగా రాష్ట్రంలో సర్కారు వైద్యం పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు

ఏ గ్రామం చూసినా, ఏ వార్డు చూసినా జ్వరాలతో జనాలు మంచం పట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. 

‘‘రోజురోజుకీ పరిస్థితి విషమిస్తుంటే కమిటీల పేరుతో ఆరోగ్య శాఖ మంత్రి కాలయాపన చేస్తున్నారు తప్పితే నియంత్రణకు చర్యలు మాత్రం లేవు. గత సర్కారును తిడుతూ ఐదేళ్లు కాలయాపన చేసేస్తారా? వర్షాకాలం కాబట్టి జ్వర తీవ్రత ఉంటుంది. అటు పారిశుద్ధ్యం, ఇటు ఆసుపత్రుల్లో సదుపాయాలు చూసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాలా?’’ అని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి నేరుగా  పర్యవేక్షించాలి

అన్ని శాఖలతో కూడిన సమర్థవంతమైన పర్వవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పర్యవేక్షించాలని ప్రభుత్వానికి వైఎస్ షర్మిల సూచించారు.  జ్వరాల పీడ నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 

‘‘మన్యంలో ఇంటికొకరు మంచాన పడితే.. జ్వరాలను అరికట్టడంపై ఇంతవరకు కార్యాచరణ లేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ తలపిస్తుంది. విష జ్వరాల కాటుకు ప్రజలు బలి కాకముందే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. 

తక్షణం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి మందుల కొరత లేకుండా చూడాలి. గ్రామీణ, పట్టణ, ఏజెన్సీ ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News