KTR: కవితకు బెయిల్ రావడంపై బండి సంజయ్ ట్వీట్... తీవ్రంగా స్పందించిన కేటీఆర్

KTR urged CJI to take action on Bandi Sanjay

  • బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారని గుర్తు చేసిన కేటీఆర్
  • ఆయన స్థాయికి ఇలాంటి విమర్శ సరికాదన్న కేటీఆర్
  • కోర్టు ధిక్కార చర్యగా భావించి చర్యలు ప్రారంభించాలని సుప్రీంకోర్టును కోరిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ట్వీట్‌ను తప్పుబట్టారు. కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

బండి సంజయ్ కేంద్ర హోంశాఖ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నారని, మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. మీ స్థాయికి ఇది తగిన వైఖరి కాదని బండి సంజయ్‌ని ఉద్దేశించి పేర్కొన్నారు. గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి, గౌరవ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను (బండి సంజయ్ వ్యాఖ్యలను) కోర్టు ధిక్కార చర్యగా భావించి అందుకు అనుగుణంగా చర్యలను ప్రారంభించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

అంతకుముందు, కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కవితకు బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. "థ్యాంక్యూ, సుప్రీంకోర్ట్... ఉపశమనం లభించింది, న్యాయం గెలిచింది" అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News