Eluru Mayor Noorjahan: ఏలూరులో వైసీపీకి దెబ్బ‌.. టీడీపీలోకి మేయ‌ర్ దంప‌తులు!

Eluru Mayor Noorjahan and Her Husband Joining TDP

  • మేయ‌ర్ నూర్జ‌హాన్‌, ఆమె భ‌ర్త‌ ఎస్ఎంఆర్ పెద‌బాబు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం
  • 27న ఉండ‌వ‌ల్లిలో మంత్రి నారా లోకేశ్ స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మేయ‌ర్ దంప‌తులు 
  • ఈ మేర‌కు ఎమ్మెల్యే బ‌డేటి చంటితో సంప్ర‌దింపులు
  • మ‌రో 30 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు కూడా టీడీపీలో చేరేందుకు రెడీ

ఏలూరులో వైసీపీకి దెబ్బ త‌గిలింది. న‌గ‌ర మేయ‌ర్ నూర్జ‌హాన్‌, ఎస్ఎంఆర్ పెద‌బాబు దంప‌తులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ నెల 27న ఉండ‌వ‌ల్లిలో మంత్రి నారా లోకేశ్ స‌మ‌క్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేర‌కు ఎమ్మెల్యే బ‌డేటి చంటితో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. 

అలాగే న‌గ‌ర పాల‌క సంస్థ‌కు చెందిన 30 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అయిన‌ట్లు స‌మాచారం. ప‌సుపు కండువా క‌ప్పుకునే విష‌య‌మై ఇప్ప‌టికే కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యేతో మాట్లాడారు. కాగా, మేయ‌ర్‌తో పాటు కార్పొరేట్లు టీడీపీ తీర్థం పుచ్చుకుంటే ఏలూరు న‌గ‌ర పాల‌క సంస్థ అధికార పార్టీ వశం అవుతుంది. 

ఇదిలాఉంటే.. మేయ‌ర్ దంప‌తుల రాజ‌కీయ ప్ర‌స్థానం 2013లో టీడీపీతోనే మొద‌లైంది. ఆ ఏడాది న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అప్ప‌టి టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి బ‌డేటి బుజ్జి, ఎస్ఎంఆర్ పెద‌బాబును పార్టీలోకి ఆహ్వానించి ఆయ‌న భార్య నూర్జ‌హాన్‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. 

ఆ ఎన్నిక‌ల్లో ఆమె గెలిచి మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల‌కు ముందు మేయ‌ర్ దంప‌తులు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. కాగా, మేయ‌ర్ భ‌ర్త ఎస్ఎంఆర్ పెద‌బాబు మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు, లోకేశ్ స‌మ‌ర్థ‌త క‌లిగిన నేత‌లు అని కొనియాడారు. వారి సారథ్యంలో ఎమ్మెల్యే చంటి ఆధ్వ‌ర్యంలో న‌గ‌రాన్ని మ‌రింత అభివృద్ధి ప‌థంలో న‌డిపేందుకు కృషి చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News