HYDRA: ఇప్పటిదాకా కూల్చివేసిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి 'హైడ్రా' నివేదిక

HYDRA submits report to Telangana govt on demolistions done by till date

  • ప్రకంపనలు సృష్టిస్తున్న హైడ్రా
  • అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న వైనం
  • నిన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
  • ఇప్పటిదాకా 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్టు నివేదిక

గత కొన్ని రోజులుగా హైదరాబాదులోనూ, నగర శివార్లలోనూ హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ప్రకంపనలు సృష్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కట్టడాలు ఎవరివైనా సరే... హైడ్రా కూల్చివేస్తోంది. నిన్న అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ ను నేలమట్టం చేయడం అందుకు ఉదాహరణ. 

తాజాగా, ఇప్పటివరకు కూల్చివేసిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. నిన్నటివరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించినట్టు నివేదికలో వెల్లడించింది. మొత్తం 43.94 ఎకరాలు ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూల్చివేసినట్టు హైడ్రా పేర్కొంది. 

కూల్చివేసిన నిర్మాణాల్లో ప్రొ కబడ్డీ లీగ్ యజమాని అనుపమకు చెందిన భవనం, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావుకు చెందిన నిర్మాణం కూడా ఉందని తన నివేదికలో  వివరించింది. మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణం, ఓ ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ కు చెందిన ఐదంతస్తులు భవనం, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా భవనం, నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడికి చెందిన నిర్మాణాన్ని, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడి నిర్మాణాన్ని, చింతల్ లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు షెడ్డును కూడా కూల్చివేసినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News