KTR: దమ్ముంటే... ఊళ్ళల్లోకి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రావాలి: కేటీఆర్ సవాల్

KTR challenges Revanth Reddy

  • తిరుమలగిరిలో బీఆర్ఎస్ నేతలపై దాడి, కొండారెడ్డిపల్లిలో జర్నలిస్టులపై దాడి చేశారని ఆగ్రహం
  • దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు
  • పరిపాలించే సత్తా లేని సన్నాసి అంటూ రేవంత్ రెడ్డిపై మండిపాటు

రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి బండారం బయటపెడుతున్నందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 

"నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. నీ భాషలో చెప్పాలంటే దమ్ముంటే... మగాడివైతే ఊళ్ళల్లోకి రా... సెక్యూరిటీ లేకుండా రా. పోలీసు బలగాలను, బ్యాంకు అధికారులను, వ్యవసాయ అధికారులు అడ్డం పెట్టుకొని కాదు... మేం కూడా వస్తాం.. నువ్వు కూడా రా. ఏ ఊరుకు పోదామో పోదాం... ఎక్కడ కూడా చారాణ రుణమాఫీ కాలేదు. ఎక్కడ కూడా రుణమాఫీ పూర్తి కాలేదు. ఈరోజు రైతులు భగభగ మండుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఊళ్లలోకి వస్తే తరిమికొట్టాలని చూస్తున్నారు" అన్నారు.

ప్రజలను అడ్డుకోవడంలో తప్పు పోలీసులది కాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార గణం చెప్పింది వారు చేస్తారన్నారు. ఈ తప్పంతా ముఖ్యమంత్రిది... పరిపాలించే సత్తా లేని సన్నాసి రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారం ఎవడబ్బ సొత్తు కాదన్నారు.

తిరుమలగిరిలో బీఆర్ఎస్ నేతలు, రైతులపై, కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడి జరిగిందని, దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు

రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ... రైతులను మోసం చేస్తోందని, దీనిని నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా తమ పార్టీ నిరసనలు చేపట్టిందని కేటీఆర్ వెల్లడించారు. తిరుమలగిరిలో పార్టీ కేడర్‌తో కలిసి గాదరి కిశోర్ శాంతియుతంగా నిరసన చేపడుతుంటే... తాగిన మత్తులో అక్కడకు వచ్చిన కాంగ్రెస్ గూండాలు నిరసన శిబిరంపై సుతిలి బాంబులు వేసి, దాడులు చేసి, గుడ్లు, చెప్పులు, రాళ్లతో కొట్టి హింసకు తెగబడ్డారన్నారు. 

అప్పుడే బీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడితే... కాంగ్రెస్ వారిలో ఒక్కరూ మిగిలి ఉండేవారు కాదన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో హింస సమాధానం కాదని తమ వాళ్లు మౌనంగా ఉన్నారన్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ గూండాలకు వత్తాసు పలికారని ధ్వజమెత్తారు. ఇది రేవంత్ రెడ్డి అనే పిరికిపంద పాలనకు సంకేతమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లి రైతులకు సమాధానం చెప్పలేని దమ్ములేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి అన్నారు.

రుణమాఫీపై ఎక్కడికైనా వెళ్లి రైతులను అడిగేందుకు సిద్ధమని తాము ముఖ్యమంత్రికి సవాల్ విసిరామన్నారు. కొడంగల్ లేదా కొండెరెడ్డిపల్లి రైతులను కూడా అడుగుదామని తాము చెప్పామన్నారు. కానీ సిగ్గులేకుండా ఆయన ఇరవయ్యోసారి ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. సిగ్గులేకుండా... ఢిల్లీకి తొత్తుగా... ఢిల్లీకి గులాంగా మారారని ఆరోపించారు. ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో తిరగాల్సిన సీఎం, మంత్రులు... పోలీసులను, కిరాయిగూండాలను అడ్డుపెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.

ఆ ఇద్దరికి సీఎం క్షమాపణలు చెప్పాలి

నిన్న సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లు రైతు రుణమాఫీ గురించి అడుగుతుంటే అక్కడి కాంగ్రెస్ చిల్లరగాళ్లు, కిరాయిగూండాలు వారిపై దాడులు చేశారని మండిపడ్డారు. మహిళా జర్నలిస్టులపై దాడి చేయడమే కాకుండా, అచ్చంపేట నియోజకవర్గం నుంచి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ వరకు వారిని వెంబడించారన్నారు. 

సినిమాల్లో చూపించినట్లుగా వారిని కార్లలో అనుసరించారని ధ్వజమెత్తారు. వారిపై దాడి చేసినంత పని చేశారని, ఇది సీఎం నికృష్ట మనస్తత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చని అన్నారు. ఆ ఇద్దరు ఆడబిడ్డలు ఏం తప్పు చేశారో చెప్పాలని నిలదీశారు. వారిద్దరికి సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీ బండారం వారు బయటపెట్టినందుకు వారిపై దాడులు చేశారా? అని ధ్వజమెత్తారు. దాడి చేయడమే కాకుండా... సోషల్ మీడియాలో రోత ప్రచారం చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News