Ponguleti Srinivas Reddy: నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి... హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నా!: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Minister Ponguleti clarifies about his residence

  • బీఆర్ఎస్ వాళ్లు వెళ్లి కొలిచి... అక్రమమని తేలితే కూల్చేసుకోండని సవాల్
  • హైడ్రాను మంచి ఉద్దేశంతో తెచ్చామన్న మంత్రి
  • 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేశామన్న మంత్రి

హిమయత్ సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో తనకు ఫామ్ హౌస్ ఉందని బీఆర్ఎస్ మీడియా బురద జల్లుతోందని, తన ఇల్లు అక్రమంగా ఉంటే... వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారులకు బదులు బీఆర్ఎస్ వాళ్లే వెళ్లి కొలవాలని, అక్రమమని తేలితే కూల్చేసుకోండని కేటీఆర్, హరీశ్ రావులకు సవాల్ విసిరారు.

హైడ్రాను తాము ఓ మంచి ఉద్దేశంతో తెచ్చామన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను అనుమతించేది లేదన్నారు. అలాంటి కట్టడాలను కూల్చివేస్తున్నామన్నారు. అవన్నీ గత ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్మాణాలేనని విమర్శించారు. ఆయన శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం!

ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అయినప్పటికీ తాము హామీలు నెరవేర్చామన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తాము ఇతర ఖర్చులను తగ్గించుకొని రుణమాఫీ చేశామన్నారు. 22 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు మాఫీ చేశామన్నారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18 వేల కోట్లు జమ అయ్యాయని, మిగిలిన రైతుల ఖాతాల్లోను మరో రూ.12 వేల కోట్లు త్వరలో వేస్తామన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలా తాము మోసం చేయడం లేదన్నారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం రైతులను రెండుసార్లు మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కూడా కొందరికే రుణమాఫీ చేశారన్నారు. ప్రచారం కోసం గత ప్రభుత్వంలా వేల కోట్ల రూపాయలను వృథా చేయడం లేదన్నారు.

ఉచిత విద్యుత్ కోసం 42 లక్షల దరఖాస్తులు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. తప్పులను సవరించి మరో 7 లక్షల మందికి పైగా ఉచిత విద్యుత్ వర్తింప చేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ రాయితీ లబ్ధిదారుల సంఖ్య నిత్యం పెరుగుతోందన్నారు. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే సవరణలు చేస్తున్నట్లు చెప్పారు. 18 రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి కొత్త ఆర్వోఆర్‌ను తీసుకువస్తున్నామన్నారు. ఇది దేశానికే రోల్ మోడల్ అన్నారు.

Ponguleti Srinivas Reddy
Congress
KTR
Harish Rao
  • Loading...

More Telugu News