Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

Harish Rao open letter to CM Revanth Reddy

  • ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని పరిస్థితి నెలకొందన్న హరీశ్ రావు
  • మందుల కొరత, '1962' పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయంపై లేఖ
  • పశుసంవర్ధక శాఖ సీఎం వద్దే ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందులు లేని పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయానికి దన్నుగా, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని లేఖలో విమర్శలు గుప్పించారు. పశుసంవర్ధక శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉందని గుర్తు చేశారు. 

ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల కొరత, 1962 పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయం, మూగజీవాల మౌన రోదనను తొలగించడంలో ప్రభుత్వ వైఫల్యంపై తాను సీఎంకు లేఖ రాశానని హరీశ్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

"వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణ పట్ల మీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయం. పశుసంవర్ధక శాఖ కూడా మీ వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌనరోదనను మాత్రం పట్టించుకోవడం లేదు." అని హరీశ్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొందని, ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్, విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా తొమ్మిది నెలలుగా నిలిచిపోయిందన్నారు. పాలిచ్చే జీవులకు పొదుగు వాపు, గాలి కుంటు వ్యాధులు సోకితే ఒక్కో మూగ జీవిపై పాడి రైతులు రూ.2 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఇది వారికి అదనపు ఆర్థిక భారంగా మారిందన్నారు.

మూగజీవాల్లో అంతర పరాన్నజీవులను నివారించేందుకు మూడు నెలలకోసారి నట్టల నివారణ మందులను తప్పనిసరిగా వేయాల్సి ఉంటుందని, 9 నెలల నుంచి నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాలేయం, జీర్ణాశయం, చిన్నపేగు భాగాల్లో పరాన్న జీవులు చేరి రక్తహీనతకు గురి చేస్తున్నాయన్నారు. దీంతో రోగ నిరోధకశక్తి తగ్గి మూగజీవాలు బలహీనంగా మారుతున్నాయన్నారు. దీంతో వ్యాధుల బారిన పడ్డ జీవులు ఆసుపత్రుల్లో మందుల కొరత కారణంగా సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయన్నారు.

పశువైద్యశాలల్లో మందులు లేకపోవడంతో మూగజీవాలకు చికిత్స అందించలేకపోతున్నామని, తప్పనిసరి పరిస్థితిలో మందుల చిట్టీ రాసి బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అనారోగ్యం పాలైన మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు గాను '1962' నెంబర్‌తో పశువైద్య సంచార వాహనాలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇది దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ విధానంపై ప్రశంసలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించిందన్నారు. అంతటి గొప్ప కార్యక్రమ నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. సంచార వాహనాల్లో మందుల కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మూగజీవుల ప్రాణాలు కాపాడాలనే సదాశయం నీరుగారిపోతోందన్నారు. మరోవైపు వాహన ఉద్యోగులు సకాలంలో వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మీరు గాని, ఉన్నతాధికారులు గానీ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం మూగజీవుల సంరక్షణ పట్ల మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని అటకెక్కించారని... చేపల పంపిణీని ఆలస్యం చేస్తున్నారన్నారు. ఇప్పుడు మందులు సరఫరా చెయ్యక మూగజీవాల మరణాలకు కారణమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వానాకాలంలో వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పశు వైద్యశాలల్లో, పశు వైద్య సంచార వాహనాల్లో అవసరమైన మందులు ఉండేలా చూడాలని, నట్టల నివారణ మందులు సరఫరా చేయాలని, '1962' పశువైద్య సంచార వాహనాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News