Mohsin Naqvi: పాక్ క్రికెట్‌ స్టేడియాల దుస్థితిపై పీసీబీ ఛైర్మన్ నఖ్వీ అస‌హ‌నం!

PCB Chief Mohsin Naqvi Calls Out Poor Stadium Conditions in Pakistan

  • పాకిస్థాన్‌లో ఉన్న స్టేడియాలు ఏవీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా లేవని వ్యాఖ్య‌
  • స్టేడియాల్లో తగినన్ని సీట్లు, బాత్‌రూంలు కూడా లేవంటూ ఆవేద‌న‌
  • వ‌చ్చే ఏడాది పాకిస్థాన్‌లోనే ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ
  • గడాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి స్టేడియాల అప్‌గ్రేడ్‌ పై పీసీబీ దృష్టి

పాకిస్థాన్‌లోని స్టేడియాల దుస్థితిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మ‌న్ మోసీన్‌ న‌ఖ్వీ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న స్టేడియాలు ఏవీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా లేవని వాపోయారు. 

"మా స్టేడియాలకు, ప్రపంచంలోని మిగిలిన స్టేడియాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఏ ప్ర‌మాణాల పరంగానూ అవి అంతర్జాతీయ స్థాయి అనిపించుకోవు. స్టేడియాల్లో తగినన్ని సీట్లు లేదా బాత్‌రూంలు కూడా లేవు. స్టేడియంలో వ్యూని పరిశీలిస్తే 500 మీటర్ల దూరం నుంచి మ్యాచ్‌ చూస్తున్నట్లు అనిపించింది" అని నఖ్వీ చెప్పారు. ఈ సంద‌ర్భంగా క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుప‌ర‌చ‌డంపై దృష్టిసారించాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న ఎత్తిచూపారు.

ఇక ఈ సమస్యలను పరిష్కరించడానికి పీసీబీ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ల‌ను ప్రారంభించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలను అప్‌గ్రేడ్‌ చేయడంపై ప్ర‌ధానంగా దృష్టి పెట్టింది. 2025 ఫిబ్రవరి- మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన‌ సౌకర్యాలు కల్పించేందుకు రూ.12.8 బిలియన్లు అవసరం అవుతుందని పీసీబీ అంచనా వేసింది.

ఈ నేప‌థ్యంలో పనుల పురోగతిని సమీక్షించేందుకు తాజాగా గడాఫీ స్టేడియంను నఖ్వీ సందర్శించారు. ఈ సంద‌ర్భంగా పునరుద్ధరణ పనులు సకాలంలో పూర్తవుతాయని ఆయ‌న‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దీని కోసం ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌డ‌బ్ల్యూఓ) నిరంతరాయంగా శ్రమిస్తోందని ప్రశంసించారు. "మేము మా స్టేడియంలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. స్టేడియాల్లో మౌలిక వసతులు కల్పించడం మా మొదటి ప్రాధాన్యత" అని నఖ్వీ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News