TGSRTC: ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండక్టర్... సజ్జనార్ ప్రశంసలు

TGSRTC condoctor helps woman in bus

  • గద్వాల - వనపర్తి రూట్‌లో పల్లె వెలుగు బస్సులో ఘటన
  • సోదరులకు రాఖీ కట్టేందుకు వెళుతుండగా పురిటి నొప్పులు
  • నర్సు సాయంతో పురుడు పోసిన కండక్టర్ భారతి

గద్వాల్ - వనపర్తి ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు పురిటి నొప్పులు రాగా బస్సు కండక్టర్ ఆమెకు పురుడు పోశారు. నర్సు సహాయంతో పురుడు పోసిన వారికి టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసలు కురిపంచారు. ఇందుకు సంబంధించిన వివరాలను సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

రాఖీ పండుగ నాడు ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారని తెలిపారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

గద్వాల డిపోకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారని, బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయని పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి భారతి బస్సును ఆపించారని, అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారని తెలిపారు. ఆ మహిళ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చినట్లు వెల్లడించారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారన్నారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.

రక్షాబంధన్‌ బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతికి ఆర్టీసీ యాజమాన్యం తరపున సజ్జనార్ అభినందనలు తెలిపారు. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే... ఆర్టీసీ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని చాటుతుండటం గొప్ప విషయమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News