Eluru: ఏలూరులో దారుణం.. వివాహితపై సామూహిక లైంగికదాడి

Woman Gang Raped In Eluru Andhra Pradesh

  • 15 రోజుల క్రితమే నగరానికి బాధిత కుటుంబం
  • వివాహిత భర్తతో కలిసి మద్యం తాగిన యువకులు
  • ఆపై అతడిని కొట్టి ఆమెను లాక్కెళ్లి అఘాయిత్యం
  • నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు

ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహితపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన స్థానికంగా సంచలనమైంది. వివాహిత భర్తతో కలిసి మద్యం తాగిన యువకులు ఆపై అతడిని చితకబాది ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి, భార్యతో కలిసి 15 రోజుల క్రితమే నగరానికి వచ్చాడు. వన్‌టౌన్ రామకోటి ప్రాంతంలో ఉంటూ పగలు హోటళ్లలో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. అద్దె ఇల్లు కోసం ప్రయత్నిస్తున్న వీరు రాత్రివేళ రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీపై నిద్రించేవారు. 

చిన్నచిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరిగే నగరానికి చెందిన ముగ్గురు యువకులు వీరికి పరిచయమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి వివాహిత భర్తతో కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి అతడిపై దాడిచేసి ఆయన భార్యను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెపైనా దాడి చేశారు. మరోవైపు, యువకులు తన భార్యను లాక్కెళ్లడంతో నిస్సహాయుడైన భర్త రోడ్డుపైకి వచ్చి కేకలు వేశాడు. ఓ యువకుడికి విషయం చెప్పాడు. అతడు అక్కడికి వెళ్లే సరికి నిందితులు ముగ్గురూ పరారయ్యారు.

బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వీరిని చెంచు కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డ విజయ్‌కుమార్ అలియాస్ నానిగా గుర్తించారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News