KTR: కొండల్ రెడ్డి పర్యటన విజయవంతమైందని రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారేమో: కేటీఆర్ సెటైర్లు

KTR satires on Revanth Reddy

  • తన కుటుంబ సభ్యులు దూసుకెళ్తున్నారనే ఆందోళనలో రేవంత్ ఉన్నారేమోనని వ్యాఖ్య
  • భట్టివిక్రమార్క తెలంగాణలో బాగా తిరిగారనే ప్రస్టేషన్‌లో ఉన్నట్లుగా ఉన్నారని వ్యాఖ్య
  • ఒక్క రైతు వేదికలో ఐనా 100 శాతం రుణమాఫీ అయినట్లు చెప్పించగలరా? అని సవాల్
  • అలా చెప్పిస్తే తాను పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి నిన్న చాలా రంకెలు వేశారని, కొండల్ రెడ్డి (రేవంత్ రెడ్డి సోదరుడు) ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైతే... తన పర్యటన సక్సెస్ కాలేదనే ఫ్రస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొండల్ రెడ్డికి వర్కవుట్ అయినట్లుగా రేవంత్ రెడ్డికి అమెరికాలో వర్కవుట్ అయినట్లుగా లేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఇక్కడ తిరుపతి రెడ్డి పేరు బాగా ప్రచారం సాగిందన్నారు.

తన కుటుంబ సభ్యులు దూసుకు వెళ్తున్నారనే బాధ రేవంత్ రెడ్డిలో ఉందా? లేక తాను తెలంగాణలో లేని సమయంలో భట్టివిక్రమార్క బాగా తిరిగారనే ఆందోళన ఉందా? లేక అధిష్ఠానం ఏమైనా అంటుందనే బాధ ఉందా? అనేది అర్థం కావడం లేదన్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు.

బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని పంద్రాగస్ట్ రోజున సీఎం రేవంత్ రెడ్డి కొత్త విషయం చెప్పారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉందని తెలియక మనవాళ్లు ఉత్తరాదికి వెళ్తున్నారని సెటైర్ వేశారు. తమ హయాంలో రుణమాఫీతో పాటు రైతుబంధు కూడా అమలు చేశామన్నారు.

రుణమాఫీపై సవాల్

రుణమాఫీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని ఆయన చెప్పిన ఊరికే వెళదామని... రుణమాఫీపై ఆయన చెప్పింది నిజమని, 100 శాతం రుణమాఫీ అయిందని రైతులు చెబితే తాను పదవికి రాజీనామా చేసి, రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. ఏదైనా ఒక్క రైతు వేదికలో 100 శాతం రుణమాఫీ అయినట్లు చెప్పించగలరా? అని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు తిరిగి.... ఎంతమందికి రుణమాఫీ అయిందో వెలికి తీస్తారన్నారు.

రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీని గత ఏడాది డిసెంబర్ 9 నుంచి ఆగస్ట్ 15 వరకు జాప్యం చేశారన్నారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు 9 నెలల వడ్డీని ఎవరు కడతారో చెప్పాలని నిలదీశారు. 22.37 లక్షల మంది రైతులకు... రూ.17,934 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారన్నారు. రుణమాఫీ 40 శాతం మాత్రమే అయిందన్నారు. అరవై శాతం మందికి రుణమాఫీ ఎగ్గొట్టారన్నారు. రుణమాఫీలో అనేక కోతలు పెట్టారన్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్‌లా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు రుణమాఫీకి కొర్రీలు చెప్పని కాంగ్రెస్... ఇప్పుడు మాత్రం ఎన్నో కొర్రీలు పెడుతోందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ మోసం... కేసీఆర్‌పై ద్వేషం... ఇదే ఈ ప్రభుత్వం తీరు అన్నారు. రుణమాఫీ, ఉద్యోగాలు, ఆడపడుచులకు తులం బంగారం, నెలకు రూ.2500, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, దళితులకు రూ.12 లక్షలు, ఆటో అన్నలకు ఏడాదికి రూ.12 వేలు, రైతు కూలీలకు నెలకు రూ.1000... ఇలా అన్నింటా మోసమే చేశారన్నారు.

ఏకకాలంలో రుణమాఫీ అని ఎవరైనా మూడుసార్లు ప్రకటన చేస్తారా? ఏదో పాత గోడకు కొత్త సున్నం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఏకకాలంలో అంటే ఒకేసారి చేయాలి... ఒకేసారి ప్రకటన ఇవ్వాలన్నారు. అయినా ముఖ్యమంత్రికి పాత గోడకు కొత్త సున్నం వేసిన అనుభవం ఉన్నట్లుగా ఉందని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి అడ్డమైన ఫీట్లు చూసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా ఈ మోసాలను చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు.

  • Loading...

More Telugu News