Mpox: మానవాళికి ముప్పుగా మరో వైరస్.. విస్తరిస్తున్న ‘మంకీపాక్స్’

Mpox Outbreak Could Soon Turn Into The Next Global Pandemic Says WHO

  • బుష్ ఎనిమల్ లో బయటపడ్డ వైరస్
  • తొలినాళ్లలో ఆఫ్రికా ఖండానికే పరిమితం
  • 2022లో వివిధ దేశాలలో బయటపడ్డ కేసులు
  • తాజాగా పాకిస్థాన్ లో ఓ వ్యక్తికి సోకిన మంకీపాక్స్

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారి బెడద ప్రస్తుతం సద్దుమణిగింది. ఇటీవలి పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో కేసులు పెరిగినప్పటికీ పెద్దగా ప్రమాదకరం కాదని వైద్యులు తేల్చిచెప్పారు. 

అయితే, కొవిడ్ తర్వాత అలాంటి మరో మహమ్మారి మానవాళికి ముప్పుగా పరిణమించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఎంపాక్స్ గా వ్యవహరించే మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రికా ఖండానికే పరిమితమైన ఈ వైరస్ 2022 లో ప్రపంచ దేశాలకు పాకిన విషయాన్ని గుర్తుచేస్తోంది. 

మరోమారు ఈ వైరస్ విస్తరిస్తోందని, ఈసారి మరింత ప్రమాదకరంగా మారే డేంజర్ పొంచి ఉందని తెలిపింది. ఆఫ్రికా దేశాలతో పాటు పాకిస్థాన్ సహా మరికొన్ని దేశాలలో వైరస్ కేసులు గుర్తించనట్లు డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది.

ఏంటీ ఎంపాక్స్..?

మంకీపాక్స్ వైరస్ ను ఎంపాక్స్ గా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు. ఇది సోకిన మనుషుల శరీరంపై చిన్న చిన్న పొక్కులు (అమ్మవారు సోకినట్లు) ఏర్పడతాయి. స్మాల్ పాక్స్ లక్షణాలు కనిపిస్తాయి.

ఆఫ్రికా ఖండంలో 1958లో ఈ వైరస్ ను గుర్తించారు. 1970 లలో ఈ వైరస్ జంతువులలో, వాటి ద్వారా మనుషులకూ వ్యాపించింది. కోతుల వంటి జంతువుల (బుష్ ఎనిమల్) లో ఈ వైరస్ ఉనికి బయటపడిందని, వాటి నుంచి మిగతా జంతువులకు వ్యాపించిందని చెప్పారు. 

తొలినాళ్లలో ఈ వైరస్ ఆఫ్రికా దేశాలకే పరిమితమైంది. అది కూడా మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ వైరస్ సోకింది. వైరస్ బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ కొన్ని కేసులు నమోదయ్యాయి. చాలా వరకు జంతువులు, వాటి మాంసం కారణంగానే వైరస్ వ్యాపించింది తప్ప మనుషుల నుంచి మనుషులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు.

2022 లో విజృంభించిన వైరస్

ఎంపాక్స్ వైరస్ 2022 లో ఒక్కసారిగా విజృంభించింది. ఏకంగా 116 దేశాలలో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో వైరస్ వ్యాప్తి పీక్ కు చేరింది. వారానికి దాదాపుగా 6 వేల కేసులు రికార్డయ్యాయి. మొత్తంగా వివిధ దేశాలలో 99 వేలకు పైగా కేసులు నమోదయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. జులై 23 నాటికి మంకీ పాక్స్ తో 200 మంది మరణించినట్లు పేర్కొంది. 

వైరస్ వేగంగా వ్యాపించడానికి కారణాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా.. లైంగిక సంబంధాల వల్ల ఎంపాక్స్ వైరస్ వ్యాపిస్తోందని గుర్తించారు. వైరస్ బాధితులతో లైంగిక చర్యలో పాల్గొన్న వారికి ఎంపాక్స్ అంటుకుంటోందని తెలిపారు. ఆ తర్వాత వైరస్ లో మార్పులు, వ్యాక్సినేషన్ కారణంగా ఎంపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టాయి.

మరింత ప్రమాదకరంగా మారిన ఎంపాక్స్

వైరస్ లో జన్యుపరివర్తనాల కారణంగా ఎంపాక్స్ ప్రస్తుతం మరింత ప్రమాదకరంగా మారిందని డబ్ల్యూ హెచ్ వో పేర్కొంది. కాంగో బేసిన్ స్ట్రెయిన్ గా వ్యవహరించే క్లాడ్ 1 ఎంపీఎక్స్ వి రకం వైరస్ తో మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. 

కాంగో లోని సౌత్ కీవూ ప్రావిన్స్ కేంద్రంగా ప్రస్తుతం ఎంపాక్స్ విస్తరిస్తోందని, ఇది గ్లోబల్ పాండెమిక్ గా మారే అవకాశం ఎక్కువని చెప్పింది. ఈ వైరస్ కు మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే గుణం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని, మరణాలు కూడా పెరుగుతాయని హెచ్చరించారు. 

ఎంపాక్స్ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాధి నిర్ధారక పరీక్షలు పెంచడం, యాంటీ వైరల్ ట్రీట్మెంట్, వ్యాక్సిన్ తయారీ పెంచడం వంటి చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ పై పరిశోధనలకు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉందన్నారు.

  • Loading...

More Telugu News