Nara Lokesh: తాడేపల్లిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh started Anna Canteen in Tadepalli

  • పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించిన మంత్రి నారా లోకేశ్ 
  • నేడు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్ ల ప్రారంభం
  • అన్న క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుండి భారీగా విరాళాలు

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం నులకపేటలో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గుడివాడలో అన్న క్యాంటిన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా వంద అన్న క్యాంటీన్ లను ప్రారంభించే క్రమంలో భాగంగా ఇవాళ 99 అన్న క్యాంటీన్ లు ప్రారంభం కానున్నాయి. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నారు.
 
అన్న క్యాంటీన్ లలో కేవలం రూ.5లకే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ లను ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతగా వంద క్యాంటీన్ లను ప్రారంభిస్తున్నారు. రెండు మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్ లను అందుబాటులోకి తీసుకొని రానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలను వాయిదా వేశారు. కాగా, ఈ క్యాంటీన్ లో మూడు పూటలా కలిపి రోజుకు లక్షా అయిదు వేల మంది పేదలకు అహారం సరఫరా చేయనున్నారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి దాతల నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. క్యాంటీన్లలో ఆహారాన్ని ఇస్కాన్ అందిస్తోంది.

  • Loading...

More Telugu News