Revanth Reddy: సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy launches Seetharama project pump house

  • పూసుగూడెంలో ప్రాజెక్ట్ రెండో పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం
  • సీతారామ ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
  • తన రాజకీయ జీవిత కల నెరవేరిందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మొదటి పంప్ హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించగా, మూడో పంప్ హౌస్‌ను ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రారంభించారు.

నా కల నెరవేరింది: తుమ్మల

సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో తన రాజకీయ కల నెరవేరిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. పంప్ హౌజ్ మోటర్లు పాడవకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల బిజీ షెడ్యూల్‌లోను ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం వచ్చారన్నారు.

రైతు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి రాములవారి పాదాల వద్ద ప్రకటన చేశారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఇవాళ సగర్వంగా వైరా సభ నిర్వహిస్తున్నామన్నారు. నాగార్జున సాగర్ నీళ్ళు రాని పక్షంలో గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టుకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

తక్కువ సమయంలో 70 రోజుల్లో వైరా లింక్ కెనాల్ పూర్తి చేశామన్నారు. తమ ప్రభుత్వం నీరు అందించి సాగుకు దన్నుగా నిలుస్తోందన్నారు. అలాగే రుణమాఫీ చేసి రైతన్నల పక్షమని నిరూపించుకున్నామన్నారు. మిగిలిన సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు సకాలంలో పూర్తి చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News