Daggubati Purandeswari: ఎన్టీఆర్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని చంద్రబాబును కోరాం: పురందేశ్వరి

asked Chandrababu to setup NTR museum says Purandeswari

  • గుంటూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • వికసిత ఏపీ కోసం అందరం కలిసి పని చేద్దామన్న పురందేశ్వరి
  • ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడి

ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి, మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఆనాడు దాదాపు 40 కోట్ల మంది దేశ ప్రజలు స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారని చెప్పారు. ఇప్పుడు దేశ జనాభా 144 కోట్లకు చేరుకుందని... దేశ ఐక్యతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని చెప్పారు. 

గుంటూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని పురందేశ్వరి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, 2040 నాటికి వికసిత భారత్ ను చూడాలనేది మోదీ లక్ష్యమని... వికసిత ఏపీ కోసం అందరం కలిసి పని చేద్దామని అన్నారు. 

మొన్నటి ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని పురందేశ్వరి చెప్పారు. కూటమికి రాష్ట్ర ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

ప్రజల సమస్యల పరిష్కారం కోసం 'వారధి' అనే కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభించిందని పురందేశ్వరి చెప్పారు. ఈరోజు నుంచి అన్ని బీజేపీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించి, వాటి వివరాలను ఒక యాప్ లో కూడా పెడతామని చెప్పారు. అందరం ప్రజా సేవకులుగా పని చేద్దామని... బాధితుల కన్నీరు తుడుద్దామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరామని తెలిపారు.

Daggubati Purandeswari
BJP
Chandrababu
NTR
Telugudesam
  • Loading...

More Telugu News