Chandrababu: ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే: సీఎం చంద్రబాబు

CM Chandrababu inaugurates Anna Canteen Gudivada

  • ఏపీలో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం
  • గుడివాడలో పేదలతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు, భువనేశ్వరి
  • ఇది శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని చంద్రబాబు ఆకాంక్ష
  • విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • మంచి పని కోసం ఖర్చుపెడితే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని వెల్లడి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు. పేదలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం అందిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమేనని వ్యాఖ్యానించారు. కడుపు నిండా తిండి తినాలని కోరుకుంటామని తెలిపారు. 

ఆయన డొక్కా సీతమ్మ గురించి కూడా ప్రస్తావించారు. నాడు గోదావరి దాటి వచ్చిన వాళ్లకు డొక్కా సీతమ్మ తిండి పెట్టేదని, ఇప్పటికీ డొక్కా సీతమ్మను అన్నదానంలో  మేటి మహిళగా గుర్తుపెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు. 

ఎన్టీ రామారావు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతిలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాము అన్న క్యాంటీన్లను తీసుకువస్తే, గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని అన్నారు. 

"రద్దు చేయవద్దు... క్యాంటీన్లకు మీ పేరే పెట్టుకుని వాటిని కొనసాగించండి... పేదలకు పట్టెడన్నం పెట్టండి అని ఆనాడు కోరాం. ఒకవేళ మీరు అన్నం పెట్టలేకపోయినా దాతలు వస్తారని చెప్పాం. కానీ గత ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతుంటే అడ్డుకున్నారు. ఇక అలాంటి పరిస్థితి రాదు. సెప్టెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు తీసుకువస్తాం. 

పేదవాళ్లకు తిండిపెట్టడం మనందరి కనీస బాధ్యత. ఓ మంచి ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం కోసం హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదాయకం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని పిలుపునిస్తున్నా. ఇది శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఖర్చుపెడితే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి" అని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News