YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసు: విచారణ నుండి తప్పుకున్న సుప్రీం న్యాయమూర్తి

Big twist in Jagan embezzlement case

  • జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఈడీ
  • ఈడీ పిటిషన్ల పై విచారణ నుండి తప్పుకున్న న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్
  • సెప్టెంబర్ 2 తర్వాత మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం 

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతనే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పధ్ధతినే అనుసరించాలని అప్పట్లో (2022 సెప్టెంబర్ 8న) హైకోర్టు స్పష్టం చేసింది. 

అయితే హైకోర్టు తీర్పును గత ఏడాది మార్చి నెలలో ఈడీ .. సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అయితే..కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుండి తప్పుకొంటున్నానని జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్ధమవ్వగా, జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్లను లిస్ట్ చేయనున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుండి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని ఆయన ఆదేశించారు.

  • Loading...

More Telugu News