Chandrababu: డోలీల్లో మోసుకొచ్చారు అనే మాట ఇకపై వినిపించకూడదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu reviews on state medical and health dept

  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ప్రభుత్వ ఆసుపత్రులను వైసీపీ సర్కారు భ్రష్టుపట్టించిందన్న చంద్రబాబు
  • వైద్య, ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని ఆదేశాలు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్ గా ఏపీ ప్రభుత్వ ఆసుపత్రులు మారాలని అభిలషించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. టెలీమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. 

గత వైసీపీ సర్కారు ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టుపట్టించిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందే రోగులకు శుభ్రమైన దుప్పట్లు అందించాలని తెలిపారు. 

ఇక నుంచి ఎక్కడా కూడా ఆసుపత్రులకు రోగులను డోలీల్లో మోసుకొచ్చారు అనే వార్తలు వినపడకూడదని, ఫీడర్ అంబులెన్స్ ల ద్వారా రోగులను తరలించాలని చంద్రబాబు ఉద్ఘాటించారు. మండలాల వారీగా కిడ్నీ బాధితుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. 

ఇక, నకిలీ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అంగవైకల్యాన్ని నిర్ధారిస్తూ ఇచ్చే నకిలీ సదరం సర్టిఫికెట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ సదరం సర్టిఫికెట్లపై పూర్తి సమాచారం సేకరించాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ, నకిలీ పత్రాల జారీకి అడ్డుకట్ట వేయాలని అన్నారు. అంగవైకల్యం ఉన్నవారికి వివిధ రూపాల్లో పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు.

Chandrababu
Medical and Health Dept
Review
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News