Shardul Thakur: ఆస్ట్రేలియా పర్యటనలో మమ్మల్ని దారుణంగా ట్రీట్ చేశారు: శార్దూల్ ఠాకూర్

Shardul Thakur reveals what conditions they had faced in Australia tour

  • 2020-21 సీజన్ లో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా
  • 2-1తో సిరీస్ కైవసం
  • ఆస్ట్రేలియా గడ్డపై కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నామన్న శార్దూల్ ఠాకూర్

టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ 2020-21 సీజన్ లో ఆస్ట్రేలియా పర్యటనలో తమకు ఎదురైన అవాంఛనీయ పరిస్థితులను వివరించాడు. 

ఆ పర్యటనలో అనేక మంది టీమిండియా ఆటగాళ్లు గాయాలబారిన పడినా, టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ చూపి టెస్టు సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్ తొలి టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలడంతో, మిగిలిన టెస్టుల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తాయని అందరూ భావించారు. కానీ భారత జట్టు అద్భుతంగా పుంజుకుని సిరీస్ విజేతగా నిలిచింది. ఆసీస్ ను వారి సొంతగడ్డపైనే చిత్తు చేసింది. ఈ విజయంలో శార్దూల్ ఠాకూర్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. 

ఇటీవల ఓ కార్యక్రమంలో శార్దూల్ ఠాకూర్ మాట్లాడుతూ, మైదానం వెలుపల తమకు ఎంతో కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయని, సరిగ్గా చెప్పాలంటే దారుణమైన అనుభవాలు చవిచూశామని చెప్పాడు. పర్యటనపై అప్పటికే నీలినీడలు కమ్ముకుని ఉంటే, 14 రోజుల క్వారంటైన్ విధిస్తామంటూ క్వీన్స్ లాండ్ ప్రభుత్వం బెదిరించిందని వెల్లడించాడు. 

తాము బస చేసిన హోటల్ లో నాలుగైదు రోజుల పాటు గదిని శుభ్రం చేసేవాళ్లు కాదని, బెడ్ షీట్లు మార్చుకుందామంటే ఐదారు ఫ్లోర్లు పైకి ఎక్కాల్సి వచ్చేదని శార్దూల్ ఠాకూర్ వివరించాడు. 

"ఆ తర్వాత సిడ్నీ నుంచి బ్రిస్బేన్ వెళ్లాం... అక్కడ క్వీన్స్ లాండ్ రాష్ట్రానికి ఓ లేడీ గవర్నర్ ఉన్నారు. ఇక్కడికి మీరెందుకొచ్చారు? అన్నట్టుగా ఆమె చాలా కఠినంగా మాట్లాడారు. భారతీయులకు ఆతిథ్యం ఇవ్వడానికి మేం సిద్ధంగా లేం... వారికి ఆతిథ్యమివ్వడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు" అని ఠాకూర్ వివరించాడు. 


"ఆ సిరీస్ లో మమ్మల్ని ఒత్తిడికి గురిచేయడానికి అనేక ప్రతికూల అంశాలను తెరపైకి తెచ్చారు. ఆ సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ గా ఉన్న టిమ్ పైన్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. కానీ ఆ సిరీస్ లో నేను ఆడాను కాబట్టి నిజానిజాలేంటో నాకు తెలుసు. విరాట్ కోహ్లీ సిరీస్ మధ్యలో వెళ్లిపోయాక, అజింక్యా రహానే జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ సిరీస్ లో మాకు కావాల్సినవి సాధించుకోవడం కోసం రహానే, జట్టు కోచ్ రవిశాస్త్రి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో ఒక పోరాటమే చేశారు" అని శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News