Bangladesh Crisis: తండ్రి తెచ్చిన రిజర్వేషన్లే... షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి!

Developments behind Sheikh Hasina resignation

  • బంగ్లాదేశ్ లో కల్లోలభరిత పరిస్థితులు
  • రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం తీవ్రరూపం
  • ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా

భారత్ పొరుగుదేశం బంగ్లాదేశ్ ఇప్పుడు సైనిక పాలనలోకి వెళ్లింది. దీనికంతటికీ కారణం బంగ్లాదేశ్ జాతిపిత, మాజీ అధ్యక్షుడు ముజిబుర్ రెహ్మాన్ గతంలో తెచ్చిన రిజర్వేషన్లు. నిన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ముజిబుర్ రెహ్మాన్ కుమార్తే. తండ్రి తెచ్చిన రిజర్వేషన్లు ఆమె రాజీనామాకు దారితీశాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటం జరగ్గా, పెద్ద సంఖ్యలో అసువులుబాశారు. 

ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ సివిల్ సర్వీసుల్లో స్వాతంత్ర్య పోరాటయోధులకు 30 శాతం, స్వాతంత్ర్య పోరాటంలో శత్రుసైన్యం చేతిలో అత్యాచారాలకు గురైన మహిళలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ మేరకు 1972లో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. 

ఆ తర్వాత 1996లో ఈ రిజర్వేషన్లను స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు విస్తరింపజేశారు. 2009 నాటికి స్వాతంత్ర్య పోరాట యోధుల మనవళ్లు, మనవరాళ్లకు కూడా వర్తింపజేస్తున్నట్టు ప్రకటించారు. 

ఈ తరహా రిజర్వేషన్లపై 2013లోనే నిరసన జ్వాలలు రాజుకున్నాయి. బంగ్లాదేశ్ సివిల్ సర్వీసుల్లో ఉద్యోగాలు సాధించలేకపోయిన వందలాది మంది రోడ్లెక్కి నిరసనలు ప్రారంభించారు. ఈ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టుల్లోనూ విచారణకు వచ్చింది. ఈ విధమైన రిజర్వేషన్లను బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కుదిస్తూ, గత నెల 21న కీలక తీర్పు ఇచ్చినప్పటికీ, అసంతృప్తి గళాలు మరింత విజృంభించాయి. 

దాంతో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా ప్రధాన నగరాలన్నీ నిరసనలతో భగ్గుమన్నాయి. 300 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ డిమాండ్లు బలంగా వినిపించాయి. 

చివరికి, ఆందోళనకారులు నిన్న మధ్యాహ్నం ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసాన్ని ముట్టడించడం ఈ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి పరాకాష్ఠగా నిలిచింది. దాంతో, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, సైనిక విమానంలో భారత్ చేరుకున్నారు.

Bangladesh Crisis
Sheikh Hasina
Reservations
Sheikh Mujibur Rahman
  • Loading...

More Telugu News