Perni Nani: ఖాకీ పౌరుషం తెలుసు అని మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడడంలేదు: పేర్ని నాని

Perni Nani questions Pawan Kalyan

  • ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్న పేర్ని నాని
  • నడిరోడ్డుపై చంపేస్తుంటే గాల్లోకి కూడా కాల్పులు జరపలేదని విమర్శలు
  • పోలీసులు కూడా కూటమి నేతల చేతిలో అవమానపడుతున్నారని వెల్లడి 

ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత హింస జరుగుతోందని, కళ్ల ముందే ఘోరాలు జరుగుతుంటే పోలీసులు చేతులు కట్టుకుని చూస్తున్నారని విమర్శించారు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతో బహిరంగంగా తిరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల ప్రాణాలు పోతున్నా, కనీసం ఎఫ్ఐఆర్ లు కూడా నమోదు చేయడంలేదని అన్నారు. 

నడిరోడ్డుపై చంపేస్తుంటే పోలీసులు గాల్లోకి కూడా కాల్పులు జరపలేదని పేర్ని నాని తెలిపారు. అరాచకాలకు మారుపేరుగా ఉండే బీహార్ లో ప్రస్తుతం శాంతిభద్రతలు నెలకొంటే, ఏపీలో మాత్రం శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. 

ఆఖరికి పోలీసులు కూడా కూటమి నేతల చేతిలో అవమానాలకు గురవుతున్నారని, భట్టిప్రోలులో తెలుగుదేశం నేతలు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారని, ఖాకీ పౌరుషం తెలుసంటూ మాట్లాడిన పవన్ కల్యాణ్ దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని పేర్ని నాని నిలదీశారు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని, ఇంత దిగజారిన ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలోనే చూస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News