Krishna Chivukula: ఐఐటీ మద్రాసుకు​ తెలుగు తేజం కృష్ణ చివుకుల భారీ విరాళం

Telugu NRI Krishna Chivukula Donates Rs 228 Cr to IIT Madras

  • ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం 
  • ఇంత‌కుముందు 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్ల సాయం
  • ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల విరాళం
  • అమెరికాలో శివ టెక్నాలజీస్ స్థాపించిన‌ బాపట్లవాసి

అమెరికాలో స్థిర‌ప‌డ్డ తెలుగుతేజం కృష్ణ చివుకుల మ‌రోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాను ఇంజినీరింగ్ చ‌దివిన ఐఐటీ మద్రాస్‌కు ఆయ‌న‌ ఏకంగా రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఇలా కృష్ణ ఈ ఐఐటీకి విరాళం ఇవ్వ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంత‌కుముందు కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప‌లు విధాలుగా ఈ విద్యా సంస్థ‌కు ఆయ‌న సాయం చేశారు. 

ఐఐటీ మ‌ద్రాస్‌కు చెందిన‌ 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అలాగే 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని ప్ర‌క‌టించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

దీంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అడ్మిషన్‌ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారు. బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లోని 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బెంగళూరులో బాప్టిస్ట్‌ ఆసుపత్రిలో పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. 

అలాగే మైసూర్ ప‌రిధిలోని చామరాజనగర్ లో ఆయ‌న ఓ పాఠ‌శాల‌ను దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్‌ అవార్డు అందజేయ‌డం జ‌రిగింది. 

బాపట్ల బిడ్డ కృష్ణ చివుకుల..
డాక్టర్‌ కృష్ణ చివుకుల ఏపీలోని బాపట్లకు చెందిన‌వారు. ఆయ‌న‌ది మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం. ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేసిన ఆయ‌న‌ ఐఐటీ మద్రాస్‌లో 1970లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ ప‌ట్టా పొందారు. ప్ర‌ముఖ‌ హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చ‌దివారు. అలాగే తుముకూర్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

37 ఏళ్ల వ‌య‌సులోనే అమెరికాలోని ప్రముఖ హాఫ్‌మన్‌ ఇండస్ట్రీస్ కి తొలి భారతీయ గ్రూప్ అధ్య‌క్షుడిగా, సీఈఓగా ప‌ని చేశారు. కొంత‌కాలం ఈ సంస్థ‌లో ప‌ని చేసిన త‌ర్వాత  బయటకొచ్చి న్యూయార్క్ లో ‘శివ టెక్నాలజీస్ అనే సంస్థ‌ను స్థాపించారు. మాస్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ సాంకేతికతను అందించడంలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్ది శభాష్ అనిపించుకున్నారాయ‌న‌. ఇదే కంపెనీని క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులోనూ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. 

భారత్‌లో మొదటిసారి 1997లో మెటల్‌ ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌ (ఎంఐఎం) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే కావడం విశేషం. కొన్నాళ్లకు బెంగళూరు కేంద్రంగా ‘ఇండో ఎంఐఎం’ సంస్థను ప్రారంభించిన ఆయన... తర్వాత ‘ఇండో యూఎస్‌ ఎంఐఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.1000 కోట్లకు పైనే. అంతేకాదు, 2009లో చిత్తూరు జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను కూడా స్థాపించారు.

కాగా, ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలు ఇచ్చే వ్యక్తులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణ చివుకుల అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు.

  • Loading...

More Telugu News