Komatireddy Venkat Reddy: ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులపై కోమటిరెడ్డి అసంతృప్తి

Minister Komatireddy Venkatareddy angry with officials

  • ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి ఎలివేటెడ్ కారిడార్ పనుల పరిశీలన
  • అధికారుల తీరుపై అసహనం వెలిబుచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • ఆరేళ్లలో ఆరు కిలోమీటర్ల వంతెన పూర్తి చేయలేకపోయారని ఆగ్రహం

ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదంటే  సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. ఆరేళ్ల కాలంలో ఆరు కిలోమీటర్ల వంతెన వేయలేకపోయారంటే ఏమనాలి అంటూ మండిపడ్డారు. 

ఇవాళ ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

బ్రిడ్జి నిర్మాణంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కోమటిరెడ్డి విమర్శించారు. కాంట్రాక్టర్ పై నిందలు మోపడం కాదు... మీరు (అధికారులు) చేయాల్సిన పని సక్రమంగా నిర్వర్తించలేకపోయారని అసహనం ప్రదర్శించారు. ఈ చర్చలో పాల్గొనడానికి అధికారులు అర్హులు కారని నిర్మొహమాటంగా చెప్పేశారు. 

త్వరితగతిన పూర్తి చేయడానికి మీ వద్ద  ఉన్న ప్రణాళిక ఏమిటి? అని ప్రశ్నించారు. అధికారులు ఇకనైనా సాకులు చెప్పడం మాని, సెప్టెంబరు చివరి కల్లా ఎలివేటెడ్ కారిడార్ టెండరు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News