KTR: సీఎం ఛాంబర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన... కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్!

Police arrested KTR and Harish Rao

  • సబితకు క్షమాపణ చెప్పాలని సీఎం ఛాంబర్ వద్ద నినాదాలు
  • కేటీఆర్, హరీశ్ రావులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బీఆర్ఎస్ కార్యాలయం వైపు తరలింపు

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎంట్రన్స్ వద్ద ఆందోళన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్న సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వారు సీఎం ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. సబితకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ సహా ఎమ్మెల్యేలను అసెంబ్లీ మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి... బీఆర్ఎస్ భవన్ వైపు తీసుకువెళ్లారు.

పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఈ రోజు నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News