KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR challenges Revanth Reddy government

  • కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదని కేటీఆర్ విమర్శ
  • అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా? అని అడుగుదామని సవాల్
  • రైతుల కోసమే రైతుబంధు తెచ్చామన్న కేటీఆర్

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని యువత చెప్పినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. తమ హయాంలో పరీక్షలు జరిగి, ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు.

'అశోక్ నగర్ చౌరస్తాకు సెక్యూరిటీ లేకుండా వెళ్దాం... అక్కడి యువకులను అడుగుదాం... రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం ఇచ్చారని చెబితే నేను రాజీనామా చేసి వెళ్తా. అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి వస్తానని చెప్పినా సరే'నని కేటీఆర్ సవాల్ చేశారు. మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలుగా చెప్పుకోవద్దని సూచించారు. విద్యార్థులు పోస్టులు పెంచమంటే పోలీస్ జులుం, పరీక్షలు వాయిదా వేయమంటే అరెస్టులు... ఇదేమిటని నిలదీశారు. వాయిదా వేయమని విద్యార్థులు అడిగితే... వారిని సన్నాసులు అని సీఎం అనడం సరికాదన్నారు. ఎవరైతే అధికారం ఇచ్చారో... ఆ నిరుద్యోగులను పట్టుకొని కోచింగ్ సెంటర్ల కోసం వాయిదా కోరుతున్నారని ఆరోపించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయమంటే సంక్షోభం... కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు.. కాంగ్రెస్ రాగానే సాగునీరు కట్ అయి పంటలు ఎండిపోయాయి... రైతుబంధు కూడా కట్ అయిందని విమర్శించారు.

అందుకే రైతుబంధు తెచ్చాం

రైతుల బతుకులు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్లు రైతులకూ ఇవ్వాలన్నారు. అందుకే తాము రైతుబంధును తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో మునిగి... రైతు వెన్ను విరిగి... పల్లె కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి ఏపీలో పదుల ఎకరాలు ఉన్న రైతులు కూడా నీరు లేక పంటలు పండించే పరిస్థితి లేక... బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. అందుకే తాము రైతుబంధు తెచ్చామన్నారు. 

పదేళ్లు అధికారంలో ఉండి మీరు ఉద్యోగాలు ఎందుకివ్వలేదు: సీతక్క

ఇంటింటికి ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. పదేళ్లపాటు ఓయూకు వెళ్లలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఆశావర్కర్లు, అంగన్వాడీల పెన్షన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు.

చిరు ఉద్యోగుల తల్లిదండ్రుల పెన్షన్ తీసేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు.

సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు: శ్రీధర్ బాబు

దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కిన బీఆర్ఎస్‌కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 

గుజరాత్ వద్దన్న ఫసల్ బీమా మనకెందుకు?: కేటీఆర్

ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ వద్దని చెబుతున్న ఇందులోకి మనం వెళ్లడం ఏమిటన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అని చెబుతూ... రెండుసార్లు ప్రకటన ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తేనే 16 వేల కోట్లు అయిందని, మరి మీరు లక్షన్నర రుణమాఫీ చేస్తే రూ.12 వేల కోట్లే ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ఎన్ని కోతలు జరుగుతున్నాయో దీనిని బట్టి తెలుసుకోవచ్చన్నారు.

  • Loading...

More Telugu News