Dr Suneetha Krishanan: సునీతా కృష్ణన్ ఒక సర్వైవరే కాదు ఒక సేవియర్: మంత్రి సీతక్క

Minister Seethakka launches auto biography book of Dr Suneetha Krishnan

  • ఆటో బయాగ్రఫీ రాసిన ప్రజ్వల ఎన్జీవో నిర్వాహకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్
  • హైదరాబాదులో పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క, యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ 

ప్రముఖ సంఘసేవకురాలు, ప్రజ్వల సేవా సంస్థ నిర్వాహకురాలు డా. సునీతా కృష్ణన్ రాసిన 'ఐ యామ్ వాట్ ఐ యామ్' (I am what I am) పుస్తకాన్ని తెలంగాణ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. బేగంపేటలోని పార్క్ గ్రీన్ హోటల్‌లో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ సభకు మంత్రి సీతక్క, అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

పుస్తకావిష్కరణ అనంతరం మంత్రి సీతక్క ప్రసంగించారు. మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న అమ్మాయిలను కాపాడిన సునీతా కృష్ణన్ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయం అని కొనియాడారు. అత్యాచార బాధితులు కుంగిపోకుండా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం సునీతా కృష్ణన్ గొప్పతనం అని ప్రశంసించారు. 

"సునీతా కృష్ణన్ ఒక సర్వైవరే కాదు ఒక సేవియర్. తన గాయాలను ఉద్యమాలుగా మలచిన సునీతా కృష్ణన్ నాకు కూడా స్పూర్తే. దాడులకు వెరవకుండా ఎందరో అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి కాపాడింది. బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఆడపిల్లలను రక్షించి వారికి తిరిగి మంచి జీవితాల్ని ప్రసాదించడం సునీతా కృష్ణన్ గొప్పతనం. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలకు సునీతా కృష్ణన్ ఒక రోల్ మోడల్. ఆమె పోరాటాలకు, కృషికి ప్రభుత్వం ఎల్లపుడూ అండగా ఉంటుంది. సునీతా కృష్ణన్ పోరాటంలో భాగస్వాములైన అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు" అని అన్నారు.

అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ... "సునీతా కృష్ణన్ లాంటి వ్యక్తితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల కోసం ఆమె చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. ఆమెతో కలిసి చేసిన ఈ ప్రయాణం మాకు ఎంతో గర్వంగా ఉంది. మాది ఎన్నో ఏళ్ల స్నేహబంధం. ఆమె జర్నీ, ఆమె పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఎంతో మందికి ఆమె కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఈ రోజు ఇలా ఆమె కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది" అని వివరించారు.

సునీతా కృష్ణన్ మాట్లాడుతూ.. "నా దగ్గర ఒక్క రూపాయి లేనప్పుడు నాకు గ్రీన్ పార్క్ హోటల్ ఎంతో సాయం చేసింది. ఆ సెంటిమెంట్ వల్లే ఈ రోజు ఇక్కడ బుక్‌ను రిలీజ్ చేయాలని అనుకున్నాను. నా బుక్ లాంచింగ్‌కు వచ్చినందుకు మంత్రి సీతక్క గారికి థాంక్స్. ఆమెను ఎప్పటి నుంచో కలవాలని కోరుకున్నాను. ఆమె పోరాట స్ఫూర్తి, పడిన కష్టాలు నాకు తెలుసు. ఆమె మనకు మంత్రి కావడం ఆనందంగా ఉంది. 

జెన్నిఫర్‌తో నా బంధం ఇప్పటిది కాదు. నాకు ఎంతో అండగా నిలిచారు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంతో మంది ఇచ్చిన సహకారంతోనే ఇక్కడ నిల్చున్నాను. ఈ రోజు ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరితోనూ నాకు ఎంతో అనుబంధం ఉంది. 

ఈ బుక్ రాయడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి మా నాన్న మరణం. మా నాన్న ఆటో బయోగ్రఫీ రాసుకోవాలని అనుకున్నారు. ఆయన చనిపోవడానికి రెండు నెలల ముందే పబ్లిష్ చేశాం. ఆ రెండు నెలల తరువాత ఆయన కన్నుమూశారు. ఆయన సంతాప దినానికి వచ్చిన ప్రతీ ఒక్కరూ దాన్ని చదివి ఎంతో ప్రభావితులయ్యారు. మా నాన్న ఘనతలను వారు ఎంతగానో పొగిడారు. అది చూశాక నా ఆటో బయోగ్రఫీ కూడా రాసుకోవాలని అనుకున్నాను. 

నా మీద సినిమా తీయాలని బాలీవుడ్ వాళ్లు బయోపిక్ రెడీ చేశారు. వాళ్లు నా పర్మిషన్ అడిగారు. కానీ నేను నో చెప్పాను. వాళ్లు యూట్యూబ్, వికీపీడియా, గూగుల్ నుంచి తీసుకున్నారట. నా కథను నేనే రాసుకోవాలని అనుకున్నాను... 13 రోజుల్లోనే ఈ బుక్ రాసేశా. 'బీయింగ్ సర్వైవర్' అని పేరు పెట్టాను. కానీ అందరూ కూడా నువ్వు సర్వైవర్ కాదు.. ఫైటర్ అని అన్నారు.  చివరకు 'ఐ యామ్ వాట్ ఐ యామ్' అని పేరు పెట్టాను" అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News