Telangana: రాష్ట్రానికి అన్యాయం జరిగింది.. ఢిల్లీలో టీ కాంగ్రెస్ ఎంపీల ధర్నా!

Telangana Congress MPs dharna in Delhi

  • విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఏపీకి మాత్రమే అమలు చేశారని ఆవేదన
  • బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రధానికి, కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడి
  • తెలంగాణకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌లో పోరాడుతామని వ్యాఖ్య

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ తెలంగాణకు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ... విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఏపీకి మాత్రమే అమలు చేసేలా బడ్జెట్‌లో హామీలు, కేటాయింపులు ఉన్నాయన్నారు.

తెలంగాణలోని పాత తొమ్మిది జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల కింద నిధులు ఇస్తామని చెప్పి దాని గురించి బడ్జెట్‌లో ఏమీ మాట్లాడలేదన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలపై బీజేపీతో బీఆర్ఎస్ రాజీపడిందని విమర్శించారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌లో పోరాడుతామన్నారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారన్నారు. కేంద్రమంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. విభజన చట్టం 2014లో ఉంటే నాటి నుంచి లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్‌లోనే ఎందుకు చేశారో చెప్పాలన్నారు. ప్రధాని కుర్చీని కాపాడుకోవడానికే నితీశ్‌కు చెందిన బీహార్, చంద్రబాబుకు చెందిన ఏపీ రాష్ట్రాలకు న్యాయం చేశారని విమర్శించారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News