Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే 45 పైసలు కూడా తిరిగి ఇవ్వడం లేదు... తొలి నిరసన ఇదే: రేవంత్ రెడ్డి

Revanth Reddy moved resolution on central budget

  • దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాల నుంచి 22 లక్షల కోట్లు కేంద్రానికి వెళ్లాయన్న సీఎం
  • యూపీకి దక్షిణాది రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్రం ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి
  • ఫెడరల్ స్ఫూర్తితోనే తాను మోదీని కలిశానన్న ముఖ్యమంత్రి
  • ఎవరికీ తలొంచడం కాదని వ్యాఖ్య

తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి ఒక రూపాయి చెల్లిస్తే మనకు కనీసం 45 పైసలు కూడా తిరిగి రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో జరిగిన వివక్షను నిరసిస్తూ ఈ నెల 27న నీతి అయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి జరగాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారన్నారు.

ఈ పదేళ్ల కాలంలో కేంద్రానికి దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాల నుంచి రూ.22 లక్షల కోట్లకు పైగా వెళితే కేవలం రూ.6 లక్షల కోట్లకు పైగా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. అదే ఉత్తర ప్రదేశ్ కేవలం రూ.3.41 లక్షల కోట్లు చెల్లిస్తే దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆ రాష్ట్రానికి ఇచ్చిందని విమర్శించారు. బీహార్ నుంచి ఒక రూపాయి వెళితే రూ.7 తిరిగి ఇస్తోందన్నారు. మోదీ ఏమైనా గుజరాత్‌లోని తన ఎస్టేట్‌లు అమ్మి ఇస్తున్నాడా? అని సీఎం ధ్వజమెత్తారు.
 
ఫెడరల్ స్ఫూర్తితో మోదీని కలిశా... తలొంచడం కాదు

ఫెడరల్ స్ఫూర్తితో ప్రధాని మోదీని పలుమార్లు కలిసి నిధులు కోరానన్నారు. పెద్దన్న అని పిలిచి... ఆ పాత్ర పోషించండని తాను మోదీని కోరానన్నారు. పెద్దన్న అని పిలిస్తే మోదీ తనకు ఇచ్చేదేమీ లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఒక మెట్టు దిగి ప్రధాని మోదీతో సఖ్యతగా ఉన్నానన్నారు. తనకు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ అవకాశం ఇస్తే సీఎం అయ్యానన్నారు. కానీ పెద్దన్న అన్నంత మాత్రాన తనకు వచ్చిందేమీ లేదన్నారు.

తెలంగాణ కోసం మాత్రమే కేంద్రంతో బాగుండే ప్రయత్నం చేశామన్నారు. తమది ప్రజాస్వామ్య స్ఫూర్తితో పని చేసే ఆలోచన తప్ప... ఎవరి ముందో తలవంచడం కాదన్నారు. తెలంగాణపై కేంద్రానిది వివక్ష కాదని... కక్ష అన్నారు. తెలంగాణ కోసం తామెన్నో త్యాగాలు చేశామని కొంతమంది చెబుతున్నారని, కానీ ఏ పదవి లేని రోజున వారికి సోనియాగాంధీ కేంద్రమంత్రి పదవి ఇచ్చారన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఈరోజు చర్చను తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నామన్నారు. బడ్జెట్‌లో మనకు జరిగిన అన్యాయంపై తొలి నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. సీఎంగా నీతి అయోగ్ సమావేశానికి వెళ్లడం లేదన్నారు. మన బహిష్కరణకు సభ మొత్తం ఆమోదం తెలపాలని కోరుతున్నానన్నారు. బడ్జెట్‌లో మన హక్కులకు భంగం కలిగాయని, వివిధ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని, ప్రాజెక్టులకు నిధులు రాలేదన్నారు. అందుకే మనం ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిరసన తెలుపుతున్నామన్నారు.

  • Loading...

More Telugu News