Madanapalle Fire Accident: మదనపల్లె ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్టు కనిపించడంలేదు: డీజీపీ

AP DGP press meet on Madanapalle fire accident

  • మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం
  • కీలక ఫైళ్లు దగ్ధమైనట్టు అనుమానం
  • సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటన స్థలికి వెళ్లిన డీజీపీ
  • దాదాపు 3 గంటల పాటు పరిశీలన
  • ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని వెల్లడి

మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలోని సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా ముందుకు వచ్చారు. 

గత రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. మూడు గంటల పాటు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని చెప్పారు. కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో ఈ అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు.

మదనపల్లె ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్టు కనిపించడంలేదని, ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఓల్టేజిలో హెచ్చుతగ్గులు లేవని, షార్ట్ సర్క్యూట్ కు అవకాశమే లేదని స్పష్టం చేశారు. కార్యాలయం కిటికీ వెలుపల కొన్ని అగ్గిపుల్లలు కనిపించాయని వెల్లడించారు. అదే సమయంలో ఈ కార్యాలయంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడంలేదని తెలిపారు. 

జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదు... ఇన్సిడెంట్ అని అర్థమవుతోందని... ఈ ఘటనపై ఎస్పీ, డీఎస్పీలకు స్థానిక సీఐ సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. ఆర్డీవో కూడా కలెక్టర్ కు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఈ ఘటనలో కొందరు రెవెన్యూ, పోలీసు అధికారుల అలసత్వం కనిపిస్తోందని, సమగ్ర విచారణ జరగాల్సి ఉందని అన్నారు. 

ఈ ఘటనను ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్ మెంట్ తీవ్రంగా పరిగణిస్తోందని డీజీపీ స్పష్టం చేశారు. దర్యాప్తు కోసం 10 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో అన్ని వివరాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు.

Madanapalle Fire Accident
AP DGP
Police
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News