KTR: నిండు కుండలా మేడిగడ్డ.. కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు

KTR fires on Congress

  • కాంగ్రెస్ కుట్రలను తట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందన్న కేటీఆర్
  • కుళ్లు, కుట్రలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తోందని వ్యాఖ్య
  • త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తామని వెల్లడి

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మేడిగడ్డ ఎందుకూ పనికిరాకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా చేసిన ప్రచారం పనికిరాకుండా పోయిందని అన్నారు. 

కాంగ్రెస్ కుట్రలను తట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని... నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ ఉందని చెప్పారు. కాళేశ్వరం కొట్టుకుపోయింది, మేడిగడ్డ కుంగిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ, వందలాది యూట్యూబ్ ఛానళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేశాయని... వాళ్ల కుళ్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తోందని అన్నారు. 

కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే... మీరు చరిత్ర హీనులుగా నిలిచిపోవడం ఖాయమని కేటీఆర్ చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. త్వరలోనే మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News