Microsoft: మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య... స్పందించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Minister Vaishnaw Says Reasons Behind Outage Identified

  • కారణాలను గుర్తించారని... పరిష్కారానికి అప్ డేట్స్ విడుదలయ్యాయని వెల్లడి
  • ఎంఈఐటీవై నిరంతరం మైక్రోసాఫ్ట్‌తో టచ్‌లో ఉన్నట్లు వెల్లడి
  • మైక్రోసాఫ్ట్ ప్రభావం తమపై లేదన్న ఎన్ఎస్ఈ, బీఎస్ఈ

మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాల్ని గుర్తించారని, వీటి పరిష్కారానికి అప్‌డేట్స్ విడుదలయ్యాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్‌లో శుక్రవారం సాంకేతిక సమస్య తలెత్తింది. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. దీంతో ఆయా సిస్టంలు షట్ డౌన్ కావడం లేదా రీస్టార్ట్ కావడం జరిగింది. విండోస్ సరిగ్గా లోడ్ కాలేదు... రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండని మెసేజ్ చూపించింది. ఈ ఎర్రర్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు సేవలపై ప్రభావం పడింది.

మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యపై కేంద్రమంత్రి స్పందించారు. ఇందుకు సంబంధించి ఎంఈఐటీవై (మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నిరంతరం మైక్రోసాఫ్ట్‌తో టచ్‌లో ఉందన్నారు. ఈ సాంకేతిక సమస్యకు కారణాలు గుర్తించినట్లు తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నెట్ వర్క్‌పై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సాంకేతిక సలహాలను జారీ చేస్తుందన్నారు.

మైక్రోసాఫ్ట్ ప్రభావం మాపై లేదు: ఎన్ఎస్ఈ

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీపై మైక్రోసాఫ్ట్ అంతరాయం ప్రభావం లేదని ఎన్ఎస్ఈ ప్రకటించింది. వివిధ దేశాల స్టాక్ ఎక్స్చేంజీలపై ప్రభావం నేపథ్యంలో ఎన్ఎస్ఈ స్పందించింది. తమపై ఎలాంటి ప్రభావం లేదని బీఎస్ఈ కూడా ప్రకటించింది.

క్రౌడ్ స్ట్రయిక్ అప్ డేట్ కారణంగా సాంకేతిక సమస్య

కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించి... ఆ తర్వాత సిస్టంలు షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అయ్యాయి. విండోస్ సరిగ్గా లోడ్ కాలేదు... రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండని మెసేజ్ చూపించింది. ఈ ఎర్రర్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు సేవలపై ప్రభావం పడింది. క్రౌడ్ స్ట్రయిక్ అప్ డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది.

క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా విండోస్ సిస్టమ్స్‌లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు ఆ సర్వీసు అప్ డేట్ కారణమని క్రౌడ్ స్ట్రయిక్ వెల్లడించింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇంజినీర్లు పని చేస్తున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News