Hardik Pandya: నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... ప్రకటించిన క్రికెటర్

Hardik Pandya Natasa Announce Separation After 4 Years Of Marriage

  • ఇటీవల ముంబై నుంచి సెర్బియాకు వెళ్లిపోయిన నటాషా  
  • ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు
  • ఈరోజు విడిపోయినట్లు ప్రకటించిన పాండ్యా

నటాషాతో నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికినట్లు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. నటాషా ఇటీవల తన కుమారుడు అగస్త్యను తీసుకొని ముంబై నుంచి సెర్బియాకు వెళ్లిపోయింది. నటాషా ముంబై నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో తాము విడాకులు తీసుకున్నట్లు పాండ్యా ప్రకటించారు.

పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని పాండ్యా వెల్లడించాడు. '4 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం. కలిసి ఉండటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం. ఇద్దరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో మధుర క్షణాల అనంతరం, కుటుంబం ఏర్పడిన తర్వాత విడిపోవడం కఠిన నిర్ణయమే' అని పేర్కొన్నారు.

అగస్త్య తమ ఇద్దరితోనూ ఉంటాడని, అతని సంతోషం కోసం మేం తల్లిదండ్రులుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కష్టమైన సమయంలో తమ గోప్యతకు సహకరించాలని, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. 

ఏడేళ్ల క్రితం పాండ్యా-నటాషాకు మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. వీరు ప్రేమలో ఉన్నట్లు 2018లో మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. 2020లో తాము ప్రేమించుకుంటున్నట్లు పాండ్యా ప్రకటించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

  • Loading...

More Telugu News